
పోస్టాఫీసుల్లోని సేవింగ్స్ స్కీమ్స్లో చాలామంది పెట్టుబడి పెడుతూ ఉంటారు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. దీంతో తమ డబ్బులపై అధిక రాబడి వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువమంది పోస్టాఫీస్ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్వంలో నడిచే పోస్టాఫీసు పథకాల్లో పొదుపు చేసుకునే డబ్బులకు భద్రత కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువమంది ఇన్వెస్ట్ చేస్తారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయి. వీటి వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడూ మారుస్తూ ఉంటుంది. జనవరి-మార్చి 2026 త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లను డిసెంబర్ 31,2025న ప్రకటించనుంది.
ఈ సారి పోస్టాఫీసుల్లోని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(SCSS), సుకన్య మృద్ది అకౌంట్(SSA) స్కీమ్స్ వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించనుందని తెలుస్తోంది. పీపీఎఫ్లో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు అందిస్తుండగా.. మిగతా పథకాలకు వడ్డీ రేట్లు 8.2 శాతంగా ఉంది. ఇక ఎన్ఎస్సీ పథకానికి 7.7 శాతం వడ్డీ రేటు ఉండగా.. పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకానికి 7.4 శాతం, కిసాన్ వికాస్ పుత్రలో 7.5 శాతం వడ్డీ అందిస్తుంది.
వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మారుస్తూ ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి, ద్రవ్యోల్బణం, బెంచ్ మార్క్ దిగుబడుల ఆధారంగా మార్పులు చేస్తూ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించి వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. 2026 జనవరి-మార్చి త్రైమాసికానికి వడ్డీ రేట్లను తగ్గించవచ్చని తెలుస్తోంది. గతంలో పీపీఎఫ్ పథకంపై కనిష్ట స్థాయిలో వడ్డీ రేటు 7 శాతంగా ఉండగా.. ఇప్పుడు తగ్గిస్తే 49 ఏళ్ల కనిష్టానికి వడ్డీ రేట్లు చేరుకోనున్నాయి. ఇదే జరిగే పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టినవారికి షాక్గా చెప్పవచ్చు. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.