UPI Payments: అలా అయితే యూపీఐ పేమెంట్స్‌ చేయం.. మెజారిటీ అభిప్రాయం

|

Sep 29, 2024 | 7:01 AM

కానీ ఒక చిన్న క్లిక్‌తో డబ్బులు ఇట్టే పంపించుకునే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం యూపీఐ పేమెంట్ సేవలు పూర్తిగా ఉచితమనే విషయం తెలిసిందే. మొబైల్‌ రీఛార్జ్‌, కరెంట్‌ బిల్ చెల్లింపులు లాంటి వాటికి మాత్రం నామమాత్రంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యూపీఐ పేమెంట్స్‌కు ఛార్జీలు వసూలు చేసే ఆలోచనలు...

UPI Payments: అలా అయితే యూపీఐ పేమెంట్స్‌ చేయం.. మెజారిటీ అభిప్రాయం
Upi Payments
Follow us on

ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌కి ఎంతలా ఆదరణ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్‌ ఉండడం, అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో యూపీఐ పేమెంట్స్‌ భారీగా పెరిగాయి. టీ కొట్టు మొదలు పెద్ద పెద్ద మాల్స్‌ వరకు ప్రతీ ఒక్కరూ యూపీఐ పేమెంట్స్‌ను స్వీకరిస్తుండడంతో చాలా మంది వీటికి మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపాలంటే బ్యాంకుల్లో క్యూ లైన్స్‌లో నిలబడడం లాంటి పెద్ద తతంగం ఉండేది.

కానీ ఒక చిన్న క్లిక్‌తో డబ్బులు ఇట్టే పంపించుకునే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం యూపీఐ పేమెంట్ సేవలు పూర్తిగా ఉచితమనే విషయం తెలిసిందే. మొబైల్‌ రీఛార్జ్‌, కరెంట్‌ బిల్ చెల్లింపులు లాంటి వాటికి మాత్రం నామమాత్రంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యూపీఐ పేమెంట్స్‌కు ఛార్జీలు వసూలు చేసే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా ఛార్జీలు వసూలు చేస్తే మాత్రం తాము యూపీఐ యాప్స్‌ను ఉపయోగించబోమని మెజారిటీ చెబుతున్నారు.

లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం యూజర్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే కేవలం 22 శాతం మంది మాత్రమే ఛార్జీలు వసూలు చేసినా యూపీఐ ఉపయోగిస్తామని తెలిపారు. ఈ సర్వే ప్రకారం 38% మంది యూజర్లు తమ చెల్లింపుల్లో 50% లావాదేవీల కోసం డెబిట్, క్రెడిట్‌ లేదా ఇతరత్రా డిజిటల్‌ విధానాలు కాకుండా యూపీఐనే ఉపయోగిస్తున్నారని తేలింది.

308 జిల్లాల్లో నిర్వహంచిన ఈ సర్వేను జూలై 15 నుంచి సెప్టెంబర్‌ 20 మధ్య చేపట్టారు. ఇందులో భాగంగా యూపీఐ లావాదేవీలపై చార్జీల అంశంపై 15,598 సమాధానాలు వచ్చాయి. మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్లను విదించే ముందు ఈ అంశాలన్నింటినీ కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకునేలా, ఈ సర్వే వివరాలను వాటి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు లోకల్‌సర్కిల్స్‌ తెలిపింది. ఎన్‌పీసీఐ లెక్కల ప్రకారం 2023–24లో యూపీఐ లావాదేవీలు 57% పెరిగాయి. తొలిసారిగా 100 బిలియన్లు దాటి 131 బిలియన్లకు చేరాయి. విలువపరంగా చూస్తే 44% ఎగిసి రూ. 199.89 లక్షల కోట్లకు చేరాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..