
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ సంయుక్త భాగస్వామ్య సంస్థ జియోస్టార్ ఏఐ ఆధారిత ఎంటర్టైన్మెంట్ రంగంలో భారీ అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. జియోస్టార్కు చెందిన జియోహాట్స్టార్ ప్లాట్ఫామ్లో పూర్తిగా ఏఐ సాయంతో రూపొందించే సిరీస్లు, చిత్రాలను విడుదల చేయాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైటింగ్, యానిమేషన్, వాయిస్ ఓవర్, ఎడిటింగ్ వంటి అన్ని దశలను ఏఐ ద్వారా నిర్వహించే కంటెంట్ను రూపొందించనుంది.
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఏఐతో రూపొందించిన ‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’ సిరీస్కు లభించిన విశేష ఆదరణ. భారతీయ ఇతిహాసం మహాభారతం ఆధారంగా రూపొందించిన ఈ 100 ఎపిసోడ్ల సిరీస్ విడుదలైన తొలి రోజే 6.5 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇది ప్లాట్ఫామ్ సాధారణ సగటు వీక్షణల కంటే రెండింతలు ఎక్కువగా నమోదైంది. ఈ విజయంతో ఏఐ ఆధారిత కంటెంట్కు మంచి వాణిజ్య అవకాశాలు ఉన్నాయని జియోస్టార్ యాజమాన్యం భావిస్తోంది.
కంటెంట్ నిర్మాణ వ్యయాలను గణనీయంగా తగ్గించడంతో పాటు భారీ స్థాయిలో కార్యక్రమాలను వేగంగా రూపొందించేందుకు ఏఐ ఉపయోగపడుతుందని సంస్థ అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టులకు మద్దతుగా సుమారు 80 మంది ఏఐ నిపుణులు, ఇంజినీర్లను నియమించుకునే యోచనలో ఉంది. నియామకాలతో పాటు మరిన్ని ఏఐ ఆధారిత ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు ధృవీకరించారు. ప్రస్తుతం జియోస్టార్ ‘మకరజ్’ టీవీ సిరీస్, ‘హనుమాన్’ ఫీచర్ ఫిల్మ్, పలు మైక్రో డ్రామాలను అభివృద్ధి చేస్తోంది. రామాయణ ఇతిహాసంలోని హనుమంతుడి పాత్ర ఆధారంగా రూపొందుతున్న ‘హనుమాన్’ ప్రాజెక్టుపై కూడా ఆసక్తి నెలకొంది.
అయితే జియోస్టార్ తాజా మహాభారత్ సిరీస్పై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. కొన్ని పాత్రలకు అదనపు వేళ్లు కనిపించడం, ముఖాలు వక్రీకరించబడటం వంటి సాంకేతిక లోపాలను ప్రేక్షకులు ఎత్తిచూపారు. కొందరు దీనిని ఏఐ చెత్తగా అభివర్ణిస్తూ మానవీయ స్పర్శ లోపించిందని విమర్శించారు. అయినప్పటికీ ఈ సమస్యలు తాత్కాలికమేనని జియోస్టార్ భావిస్తోంది. కొత్త ఏఐ సాంకేతికతలతో నాణ్యతను మెరుగుపరచి, భవిష్యత్తులో మరింత మెరుగైన కంటెంట్ను అందించగలమనే విశ్వాసంతో సంస్థ ముందుకు సాగుతోంది. ఈ ప్రణాళికలు అమలైతే, భారతదేశంలో విస్తృత స్థాయిలో ఏఐ రూపొందించిన సిరీస్లను విడుదల చేసే తొలి ప్రధాన మీడియా సంస్థగా జియోస్టార్ నిలిచే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి