ఆర్థిక సంక్షోభం.. 1991లో భారత్‌ను రక్షించిన బంగారం! ఇంట్రెస్టింగ్‌ స్టోరీ

1991లో భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో, RBI 47 టన్నుల బంగారాన్ని విదేశాలకు తాకట్టు పెట్టి 405 మిలియన్ డాలర్ల రుణం సేకరించింది. ఈ చర్య దేశాన్ని డిఫాల్ట్ నుండి రక్షించింది. అనంతర సరళీకరణ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశానిర్దేశం చేశాయి.

ఆర్థిక సంక్షోభం.. 1991లో భారత్‌ను రక్షించిన బంగారం! ఇంట్రెస్టింగ్‌ స్టోరీ
1991 Indian Economic Crisis

Updated on: May 16, 2026 | 8:21 PM

1991 జూలైలో భారతదేశం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం దేశ చరిత్రలోనే అత్యంత క్లిష్ట ఘట్టంగా నిలిచింది. విదేశీ మారక నిల్వలు కేవలం వారం రోజుల దిగుమతులకు సరిపడే స్థాయికి పడిపోవడంతో RBI అత్యవసర నిర్ణయం తీసుకుంది. అప్పటి గవర్నర్ ఎస్.వెంకిటరమణన్ నేతృత్వంలో దాదాపు 47 టన్నుల బంగారాన్ని విదేశాలకు తాకట్టు పెట్టి 405 మిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని సమీకరించారు. ఈ బంగారాన్ని ముంబై శాంతాక్రూజ్ విమానాశ్రయం నుంచి అత్యంత రహస్యంగా విమానాల ద్వారా యూకేకు తరలించారు.

ఆ సమయంలో దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత నెలకొంది. చంద్రశేఖర్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఆపరేషన్‌కు ఆమోదం తెలిపింది. తర్వాత అధికారంలోకి వచ్చిన పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ తీసుకున్న సరళీకరణ నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ చూపించాయి. 1991 సంక్షోభానికి ప్రధాన కారణాల్లో గల్ఫ్‌ యుద్ధం, పెరిగిన చమురు ధరలు, విదేశీ మారక ద్రవ్య కొరత ఉన్నాయి. అప్పట్లో విదేశీ రుణదాతలు విశ్వాసం కోల్పోవడంతో, దేశం డిఫాల్ట్ అంచుకు చేరుకుంది. దీంతో ప్రభుత్వం ముందుగా 20 టన్నుల జప్తు చేసిన బంగారాన్ని స్వాప్ ఒప్పందం ద్వారా ఉపయోగించి 215 మిలియన్ డాలర్లు సమీకరించింది. అనంతరం ఆర్‌బిఐ తన సొంత బంగారు నిల్వలను తాకట్టు పెట్టింది.

ఆపరేషన్ అత్యంత గోప్యంగా జరిగింది. ఆర్‌బిఐ బులియన్ వ్యాన్‌ల ద్వారా బంగారాన్ని ఖజానాల నుంచి విమానాశ్రయానికి తరలించి, భారీ భద్రత మధ్య కార్గో విమానాల్లో లోడ్ చేశారు. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. చాలా మంది దీనిని ఆర్థిక సంక్షోభంతో పాటు జాతీయ అవమానంగా కూడా భావించారు. అయితే ఈ చర్య భారతదేశాన్ని రుణ ఎగవేత నుంచి కాపాడింది. అదే సమయంలో ఆర్థిక సంస్కరణలకు మార్గం సుగమం చేసింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మార్చి 2026 నాటికి RBI వద్ద సుమారు 880 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. అందులో అధిక భాగం దేశీయంగానే నిల్వ చేయబడుతోంది.

ఇటీవల నరేంద్ర మోదీ కూడా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, పెరిగిన చమురు ధరల నేపథ్యంలో బంగారం దిగుమతులు దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని పెంచుతున్నాయని కేంద్రం భావిస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us