Toll Plaza: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్‌ గేట్‌ వద్ద ఆగే పనిలేదు.. రయ్‌ అంటూ దూసుకెళ్లడమే!

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై టోల్‌ గేట్‌ల వద్ద ఆగే పనిలేకుండా వాహనం నెంబర్ ఆధారంగానే టోల్‌ను కట్‌చేసుకునే కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. 2027 నాటికి దేశవ్యాప్తంగా అన్ని ఫిజికల్ టోల్ ప్లాజాలను తొలగించి, నూతన శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ టోలింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

Toll Plaza: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్‌ గేట్‌ వద్ద ఆగే పనిలేదు.. రయ్‌ అంటూ దూసుకెళ్లడమే!
Toll Plaza Removal India

Edited By:

Updated on: May 09, 2026 | 6:26 PM

​దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026 చివరి నాటికి దేశంలోని ఫిజికల్ టోల్ ప్లాజాలన్నింటినీ తొలగించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇకపై వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా ఆటోమేటిక్‌గా టోల్ వసూలు చేసే సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

​ఈ నూతన వ్యవస్థ మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF), శాటిలైట్ ఆధారిత టోలింగ్ విధానంపై ఆధారపడి ఉంటుంది. హైవేలపై ఏర్పాటు చేసే హై-స్పీడ్ కెమెరాలు, సెన్సార్లు వాహనాల నంబర్ ప్లేట్లను (ANPR) గుర్తించి, వాహనం ప్రయాణించిన కిలోమీటర్ల ఆధారంగానే టోల్ మొత్తాన్ని ఫాస్టాగ్ (FASTag) లేదా లింక్డ్ బ్యాంక్ ఖాతాల నుంచి కట్ చేస్తాయి. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఇంధన ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

​ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల వద్ద నిర్ణీత దూరం ప్రయాణించకపోయినా పూర్తి టోల్ చెల్లించాల్సి వస్తోంది. కానీ కొత్త విధానంలో పే యాజ్ యూ గో మోడల్ అమలు కానుంది. అంటే మీరు ప్రయాణించిన ప్రతి కిలోమీటరుకు మాత్రమే ఛార్జీ పడుతుంది. దీనివల్ల గతంలో రూ. 150 చెల్లించిన చోట, ప్రయాణ దూరాన్ని బట్టి కేవలం రూ. 15 మాత్రమే పడే అవకాశం ఉందని గడ్కరీ పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 85 ప్రాంతాల్లో ఈ ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి.

​ఈ టెక్నాలజీ వల్ల ఏటా దాదాపు రూ. 1,500 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని, అదే సమయంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ. 6,000 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా. అంతేకాకుండా, టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ సమస్యలు పూర్తిగా తొలగిపోయి, లాజిస్టిక్స్ సామర్థ్యం పెరుగుతుంది. 2027 నాటికి భారతీయ రహదారులు అమెరికా, యూరప్ ప్రమాణాలకు ధీటుగా మారుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us