Indian Post: ఇండియా పోస్ట్‌లో డిజిటల్ విప్లవం.. అరచేతిలోనే పోస్టల్, బ్యాంకింగ్ సేవలు!

భారత పోస్ట్ డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చింది. డాక్ సేవ, డాక్ మిత్ర యాప్‌ల ద్వారా ప్రజలు ఇంటి నుంచే పోస్టల్, బ్యాంకింగ్, పార్సిల్ వంటి సేవలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల ఆధునీకరణ, సాంకేతికత వినియోగం, మెరుగైన మౌలిక వసతులతో వినియోగదారులకు సులభంగా సేవలు అందించడమే లక్ష్యం. భవిష్యత్తులో డాక్ సేవను సూపర్ యాప్‌గా విస్తరించాలని ఇండియా పోస్ట్ ప్రణాళికలు రచిస్తోంది.

Indian Post: ఇండియా పోస్ట్‌లో డిజిటల్ విప్లవం.. అరచేతిలోనే పోస్టల్, బ్యాంకింగ్ సేవలు!
India Post Digital

Updated on: Aug 25, 2026 | 7:45 AM

ప్రజలకు మరింత చేరువయ్యేలా భారత పోస్ట్‌ డిజిటల్ సేవలను విస్తరిస్తోంది. పోస్టాఫీసుకు వెళ్లకుండానే ఇంటి నుంచే వివిధ సేవలను పొందేలా ‘డాక్ సేవ’, ‘డాక్ మిత్ర’ పేరుతో కొత్త డిజిటల్ అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ. ప్రజల కోసం డాక్ సేవ, పోస్టల్ సిబ్బంది కోసం డాక్ మిత్ర యాప్‌ను రూపొందించారు.

వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అత్యాధునిక మౌలిక వసతులు, మెరుగైన సీటింగ్ సదుపాయాలు, డిజిటల్ సేవలు, పొదుపు పథకాలను ప్రజలకు మరింత సులభంగా అందించేలా చర్యలు చేపడుతోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ పోస్టల్ సేవలను డిజిటల్‌ విధానంలోకి తీసుకువస్తోంది.

ఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో డాక్ సేవ, డాక్ మిత్ర అప్లికేషన్లతో పాటు ఆధునీకరించిన 14 పోస్టాఫీసులను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ప్రారంభించింది. సాంకేతిక ఆధునీకరణ, విధాన సంస్కరణలు, సంస్థాగత మార్పులు, ఆధునిక భౌతిక మౌలిక వసతులు అనే నాలుగు ప్రధాన అంశాలపై పోస్టల్ విభాగంలో సంస్కరణలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

పోస్టల్ రంగంలో రూ.5,700 కోట్లకు పైగా పెట్టుబడులతో రియల్‌టైమ్ లాజిస్టిక్ మానిటరింగ్, డిజిటల్ కస్టమర్ సర్వీసులు, వేగవంతమైన మెయిల్ ట్రాకింగ్ వంటి వ్యవస్థలను అభివృద్ధి చేశారు. కొత్త డిజిటల్ అప్లికేషన్ల ద్వారా పార్సిల్, బ్యాంకింగ్, యూపీఐ, మనీ ఆర్డర్ వంటి సేవలను ఒకే వేదికపై పొందే అవకాశం కల్పించారు. ఇంటి నుంచే పార్సిల్ పికప్‌ను బుక్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది.

యువతను ఇండియా పోస్ట్‌తో అనుసంధానించే ఉద్దేశంతో యూనివర్సిటీల్లో నెక్స్ట్ జనరేషన్ పోస్టాఫీసులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 110కి పైగా పోస్టాఫీసులను రీమోడలింగ్ చేయగా, ప్రధాన నగరాల్లో మరో 40 పోస్టాఫీసులను ఆధునీకరిస్తున్నారు.

భవిష్యత్తులో పోస్టల్ సేవింగ్స్, PLI, RPLI తదితర సేవలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ‘డాక్ సేవ’ను సూపర్ అప్లికేషన్‌గా విస్తరించే దిశగా ఇండియా పోస్ట్‌ ముందుకు సాగుతోంది. అదే సమయంలో పోస్టల్ రంగానికి ఏడాదికి రూ.4 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో కార్యాచరణ కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us