LPG సంక్షోభం.. భారత్‌కు భారీ గుడ్‌న్యూస్‌! ఇక గ్యాస్‌ కష్టాలు తీరిపోయినట్టేనా?

హోర్ముజ్ జలసంధి మూసివేత తర్వాత, భారత్‌కు ఎల్‌పిజి సరఫరాలు క్రమంగా పునఃప్రారంభమవుతున్నాయి. రెండు ఎల్‌పిజి ట్యాంకర్లు ఇప్పటికే భారత్ వైపు పయనిస్తున్నప్పటికీ, గల్ఫ్ ప్రాంతంలో డజన్ల కొద్దీ భారతీయ నౌకలు, ఐదు ఎల్‌పిజి ట్యాంకర్లతో సహా, ఇంకా చిక్కుకుపోయాయి. మధ్యప్రాచ్యంపై 90 శాతం ఆధారపడటం కొరతను పెంచుతోంది. సరఫరాలు వేగవంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

LPG సంక్షోభం.. భారత్‌కు భారీ గుడ్‌న్యూస్‌! ఇక గ్యాస్‌ కష్టాలు తీరిపోయినట్టేనా?
Lpg 3

Updated on: Mar 29, 2026 | 6:49 AM

హోర్ముజ్ జలసంధిని ఇరాన్‌ ప్రభుత్వం మూసివేసినప్పటికీ, భారత్‌కు ఎల్‌పిజి సరఫరాలు క్రమంగా పునఃప్రారంభమవుతున్నాయి. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం ‘BW Elm’, ‘BW Tyre’ అనే రెండు ఎల్‌పిజి ట్యాంకర్లు ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి గుండా భారత్ వైపు ప్రయాణిస్తున్నాయి. నౌకా రవాణా దాదాపుగా నిలిచిపోయిన ఈ కీలక సముద్ర మార్గంలో ఇది ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని ఇరాన్‌ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే తమ అనుమతితో శత్రుత్వం లేని నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించవచ్చని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత జెండా కలిగిన నౌకలు గల్ఫ్ ప్రాంతాన్ని దాటి తూర్పు వైపు కదులుతున్నాయి. ఇప్పటికే ‘శివాలిక్’, ‘నందా దేవి’, ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ వంటి ట్యాంకర్లు ముందుకు సాగాయి.

ఇంకా మరోవైపు, గల్ఫ్ ప్రాంతంలో అనేక నౌకలు చిక్కుకుపోయిన పరిస్థితి కొనసాగుతోంది. శుక్రవారం నాటికి ఐదు ఎల్‌పిజి ట్యాంకర్లతో పాటు సుమారు 20 భారతీయ నౌకలు అక్కడే నిలిచిపోయాయి. ‘జగ్ విక్రమ్’, ‘గ్రీన్ ఆశా’, ‘గ్రీన్ సాన్వి’ వంటి నౌకలు పశ్చిమ హోర్ముజ్ ప్రాంతంలోనే ఉండిపోయాయి. ఈ పరిణామాల మధ్య భారత్‌లో గ్యాస్ సంక్షోభం తీవ్రంగా మారుతోంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎల్‌పిజి దిగుమతిదారైన భారత్‌లో సరఫరా లోటు పెరుగుతోంది. దేశీయ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం పరిశ్రమలకు గ్యాస్ సరఫరాను తగ్గించే చర్యలు తీసుకుంటోంది.

గణాంకాల ప్రకారం భారత్ గత సంవత్సరం 33.15 మిలియన్ టన్నుల ఎల్‌పిజిని వినియోగించింది. ఇందులో సుమారు 60 శాతం దిగుమతుల ద్వారానే వచ్చింది. ముఖ్యంగా, ఈ దిగుమతుల్లో దాదాపు 90 శాతం మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడి ఉండటం ప్రస్తుత సంక్షోభాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తోంది. అయితే పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన ఖాళీ నౌకల్లోకి ఎల్‌పిజిని లోడ్ చేసి, సరఫరాలను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us