
భారత ప్రభుత్వం విమాన ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా తీసుకొచ్చిన కీలక నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు రుసుము లేకుండా అందించాలని ఇచ్చిన ఆదేశాన్ని, తదుపరి సమీక్ష జరిగే వరకు అమలు చేయకూడదని నిర్ణయించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మార్చి 18న DGCAకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ప్రయాణికులకు సమాన అవకాశాలు కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
అయితే పెరుగుతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు, నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలు ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా FIA (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్), ఆకాశ ఎయిర్ చేసిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ముందుకొచ్చింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఛార్జీల నిర్మాణంపై ప్రభావం పడే అవకాశం ఉందని, అలాగే ప్రస్తుత నియంత్రణ రహిత టారిఫ్ విధానానికి విరుద్ధంగా మారవచ్చని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సమగ్ర పరిశీలన పూర్తయ్యే వరకు ఈ ఆదేశాన్ని నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
ఇండిగో, ఎయిర్ఇండియా, స్పేస్జెట్ వంటి ప్రధాన సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న FIA, ఈ నిబంధన వల్ల వాణిజ్యపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చని పేర్కొంది. ప్రస్తుతం విమానయాన సంస్థలు సుమారు 20 శాతం సీట్లను మాత్రమే ఉచితంగా ఎంచుకునే అవకాశం ఇస్తున్నాయి. మిగిలిన సీట్లకు ప్రయాణికులు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సీటు స్థానం, లెగ్రూమ్, ముందు వరుస వంటి అంశాల ఆధారంగా ఈ ఛార్జీలు సాధారణంగా రూ.200 నుంచి రూ.2,100 వరకు ఉంటాయి. ప్రయాణికుల నుండి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుగా 60 శాతం ఉచిత సీట్ల ప్రతిపాదన తీసుకువచ్చినప్పటికీ, ప్రస్తుతం పరిశ్రమ పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి