
Diesel Export Duty: దేశీయ మార్కెట్లో ఇంధన కొరత లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేయడం ద్వారా భారీగా లాభాలు గడిస్తున్న చమురు కంపెనీల జోరుకు బ్రేకులు వేస్తూ, ఎగుమతి సుంకాన్ని (Export Duty) భారీగా పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా డీజిల్, విమాన ఇంధనం (ATF)పై ఈ పన్ను భారం పడనుంది. దేశీయ మార్కెట్లో ఇంధన లభ్యతను పెంచడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
డీజిల్, విమాన ఇంధనంపై కొత్త పన్ను రేట్లు
ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, డీజిల్ ఎగుమతిపై విధించే పన్నును రెట్టింపు కంటే ఎక్కువగా పెంచారు. డీజిల్ గతంలో లీటరు డీజిల్ ఎగుమతిపై రూ.21.5 సుంకం ఉండగా, దానిని ఇప్పుడు నేరుగా రూ.55.5కి పెంచారు.
విమాన ఇంధనం (ATF): విమానాల్లో ఉపయోగించే ఇంధనంపై కూడా పన్ను భారం పెరిగింది. లీటరుకు ఇది రూ.29.5 నుండి రూ.42కి చేరుకుంది.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది?
సాధారణంగా రిఫైనరీ కంపెనీలు విదేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుని ఇక్కడ శుద్ధి చేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కంపెనీలు దేశీయ అవసరాలను పక్కన పెట్టి, విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలు పొందుతాయి. దీనివల్ల దేశంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ఎగుమతి పన్ను పెరగడం వల్ల కంపెనీలకు విదేశాల్లో విక్రయించడం భారంగా మారుతుంది. ఫలితంగా అవి దేశీయ మార్కెట్లోనే చమురును విక్రయించడానికి మొగ్గు చూపుతాయి. తద్వారా దేశంలో ఇంధన నిల్వలు నిలకడగా ఉంటాయి.
పెట్రోల్ విషయంలో ఊరట
ఈ భారీ పన్ను పెంపు మధ్య పెట్రోల్ వినియోగదారులకు, కంపెనీలకు ఊరట లభించింది. పెట్రోల్ ఎగుమతిపై ప్రభుత్వం ఎటువంటి కొత్త పన్నును విధించలేదు. గతంలో ఉన్నట్లుగానే దీనిపై ఎగుమతి సుంకం ‘సున్నా’ (Nil) గానే కొనసాగుతుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం దేశంలో పెట్రోల్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Dubai Gold: దుబాయ్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? మన దేశంలోని ధరలతో పోలిస్తే ఎంత తేడా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి