
బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. తక్షణ అవసరాలకు డబ్బు సమకూర్చుకునే సులభమైన మార్గంగా కనిపించే బంగారు రుణం, వాస్తవానికి కొన్ని కీలకమైన షరతులు, దాగి ఉన్న ఖర్చులతో కూడి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా RBI మార్గదర్శకాల ప్రకారం ఈ రుణాలకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, వినియోగదారులు పూర్తిగా అవగాహన లేకుండా రుణం తీసుకుంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
మొదటగా బంగారు రుణం తీసుకునేటప్పుడు కేవలం వడ్డీ రేటును మాత్రమే పరిశీలించడం సరిపోదు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, బంగారం విలువ నిర్ధారణ రుసుములు వంటి అనేక అదనపు ఖర్చులను వసూలు చేస్తాయి. ఇవి సాధారణంగా రుణ మొత్తంలోనే కట్ చేయబడటంతో, వినియోగదారులకు ఆశించినంత మొత్తం చేతికి రాదు. రెండవది.. బంగారం విలువ ఆధారంగా రుణ పరిమితి నిర్ణయించబడుతుంది. RBI నిబంధనల ప్రకారం, బంగారం మార్కెట్ విలువలో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే రుణం లభిస్తుంది. ఆభరణాలలోని రాళ్లు, ఇతర లోహాలను తీసివేసిన తర్వాత మిగిలే స్వచ్ఛమైన బంగారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
మూడవది.. వడ్డీ లెక్కింపు విధానం కూడా కీలకం. కొన్ని సంస్థలు సాధారణ వడ్డీ వసూలు చేస్తే, మరికొన్ని చక్రవడ్డీ విధానం అనుసరిస్తాయి. వాయిదాలు ఆలస్యమైతే జరిమానా వడ్డీ భారాన్ని మరింత పెంచుతుంది. నాలుగవది.. రుణ చెల్లింపులో ఆలస్యం జరిగితే బ్యాంకులు బంగారాన్ని వేలం వేసే హక్కు కలిగి ఉంటాయి. సాధారణంగా 3 నుండి 6 నెలల డిఫాల్ట్ తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చివరగా ముందస్తు చెల్లింపుపై కూడా కొన్ని సంస్థలు జరిమానాలు విధిస్తాయి. కాబట్టి రుణం తీసుకునే ముందు అన్ని నిబంధనలు స్పష్టంగా తెలుసుకోవడం అత్యంత అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి