
మనదేశంలో బంగారాన్ని అన్నింటికంటే మెరుగైన సంపదగా భావిస్తారు. బంగారం కొంటే అదృష్టం కలిసొస్తుందని శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఏ సందర్భం వచ్చినా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారాన్ని కొనడానికి ప్రస్తుతం రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆభరణాల రూపంలో కొనొచ్చు లేదా కాయిన్స్/ బార్స్ రూపంలో కొనొచ్చు. ఈ రెండింటిలో ఉండే బేసిక్ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా జువెలరీ రూపంలో కొంటుంటారు. వివాహాల కోసం లేదా బహుమతులు ఇలా ప్రతి సందర్భానికి బంగారు ఆభరణాలనే కొనుగోలు చేస్తుంటారు. అయితే, బంగారు ఆభరణాలకు తయారీ ఛార్జీలు వంటి అదనపు ఖర్చులు తోడవుతాయి. ఆభరణాల డిజైన్ను బట్టి అవి 5 నుంచి 25 శాతం అదనపు ఖర్చులు యాడ్ అవుతాయి. అలాగే కొనుగోలుదారులు 3 శాతం జీఎస్టీ(GST) కూడా చెల్లించాలి. దీని వలన బంగారం విలువ కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒక గ్రాము బంగారం కొనడం కంటే ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని చేయించడానికి ఎక్కువ ధర అవుతుంది. అలాగే బంగారు ఆభరణాలు అమ్మేటప్పుడు తరుగు కింద కొంత విలువ తగ్గుతుంది. అందుకే బంగారాన్ని పెట్టుబడిగా చూసేవాళ్లకు ఈ ఆప్షన్ అంత మంచిది కాదు.
ఇక బంగారు నాణేలు/బార్స్ విషయానికొస్తే.. ఇవి స్వచ్ఛమైన బంగారంతో తయారైనవి. బంగారాన్ని పెట్టుబడిగా పెట్టాలనుకునేవాళ్లు వీటిని కొనుగోలు చేయొచ్చు. వీటిలో మేకింగ్ ఛార్జీలు చాలా తక్కువ. తిరిగి అమ్మేటప్పుడు తరుగు ఉండదు. బంగారం ధరలకు తగట్టు వీటిని అమ్ముకోవచ్చు. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లు ఆభరణాలకు బదులు గోల్డ్ కాయిన్స్ లేదా గోల్డ్ బార్స్ కొనుగోలు చేయడం బెటర్ ఛాయిస్ అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇకపోతే మూడో ఆప్షన్ కూడా ఉంది. అదే డిజిటల్ గోల్డ్. అంతే బంగారాన్ని డిజిటల్ గా కొనుగోలు చేయడం. ఇది కూడా మంచి ఆప్షన్ కిందే చెప్పుకోవచ్చు. అయితే డిజిటల్ గోల్డ్ కోసం ఎంచుకునే ప్లాట్ ఫామ్ నమ్మదగినదై ఉండాలి. మొత్తంగా చూస్తే.. బంగారాన్ని సెంటిమెంట్ గా, అందం కోసం కొనాలనుకునేవాళ్లు ఆభరణాలు కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ పెట్టుబడిగా పెట్టాలనుకుంటే డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ కాయిన్స్ రూపంలో కొనుగోలు చేయడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి