Betting App Case: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్.. గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు!

ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ కేసులో గూగుల్‌, మెటాలను విచారించనుంది ఈడీ. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్, ఎక్స్‌, షేర్‌చాట్‌, స్నాప్‌చాట్‌ ఇలా ఏ యాప్‌ ట్రెండింగ్‌లో ఉంటే.. అందులో బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేశారు సెలబ్రిటీలు..

Betting App Case: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్.. గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు!
ED summons to Google and Meta

Updated on: Jul 21, 2025 | 8:07 PM

హైదరాబాద్, జులై 21: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో దర్యాప్తును ఈడీ అధికారులు స్పీడప్‌ చేశారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలకు నోటీసులు జారీ చేసిన ఈడీ.. తాజాగా టెక్‌ దిగ్గజాలు గూగుల్, మెటాకు సమన్లు పంపారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ కేసులో గూగుల్‌, మెటాలను విచారించనుంది ఈడీ. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్, ఎక్స్‌, షేర్‌చాట్‌, స్నాప్‌చాట్‌ ఇలా ఏ యాప్‌ ట్రెండింగ్‌లో ఉంటే.. అందులో బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేశారు సెలబ్రిటీలు. ఈ క్రమంలో విచారణలో భాగంగా గూగుల్‌, మెటాకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇందులో భాగంగా బెట్టింగ్‌ యాప్‌ల కేసులో గూగుల్‌, మెటా సంస్థలకు ఈడీ సమన్లు జారీ చేసింది. జులై 28న ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంలో మొత్తం 29 మంది నటీనటులతో పాటు కంటెంట్‌ క్రియేటర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సలర్లపై విచారణ జరుగుతోంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్‌, సైబరాబాద్‌, విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన FIRల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారిస్తోంది. ఈ బెట్టింగ్ యాప్‌లతో మనీలాండరింగ్‌, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. తాము విచారణ చేస్తున్నప్పటికీ… గూగుల్‌, మెటా సంస్థలు ఇలాంటి యాప్‌లను తమ ప్లాట్‌ఫామ్‌లపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ టెక్‌ కంపెనీలు బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక, వెబ్‌సైట్ల లింక్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది.

కాగా తెలంగాణలో బెట్టింగ్స్‌ యాప్స్‌ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జూదాన్ని విచ్చలవిడిగా ప్రమోట్‌ చేయడంతో.. ప్రజలు కూడా ఆకర్షితులై.. వాటిలో డబ్బులు పెట్టి నష్టపోయారు. కొందరు లక్షలాది రూపాయలు కోల్పోయారు. దీంతో బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ప్రమోటర్స్‌గా ఉన్న సినీ సెలెబ్రిటీలు, యూట్యూబర్స్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ECIR నమోదు చేసింది. ఇది పోలీసులు నమోదు చేసే ఎఫ్‌ఐఆర్‌ లాంటిదే. బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ చేసినందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఈడి గుర్తించి ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడి దర్యాప్తు చెయ్యనుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే టాలీవుడ్‌ నటులకు ఈడి నోటీసులు పంపింది. రానా దగ్గుబాటి ఈ నెల 23న , ప్రకాష్ రాజ్ ఈ నెల 30న , మంచు లక్ష్మి ఆగస్ట్ 13న విచారణకు హజరు కావలి అని ఈడి నోటీసులు అందించింది.. బెట్టింగ్ యాప్ లతో జరిగిన అగ్రిమెంట్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకొని రావాలి అని ఆదేశించింది. మిగతా నిందితులకు సైతం త్వరలోనే ఈడి నోటీసులు ఇవ్వనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.