ATM: యూపీఐ కాలంలో కూడా ఇక్కడ ఏటీఎంలే వాడుతున్నారు.. అసలు ట్విస్ట్ ఇదే..

దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. ప్రతీఒక్కరూ యూపీఐను వాడుతున్నారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ ఏటీఎంల నుంచి ఎక్కువగా నగదు విత్ డ్రా చేసుకుంటున్నారు. ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకుంటున్న టాప్ 5 రాష్ట్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

ATM: యూపీఐ కాలంలో కూడా ఇక్కడ ఏటీఎంలే వాడుతున్నారు.. అసలు ట్విస్ట్ ఇదే..
Atm

Updated on: Jun 01, 2026 | 3:52 PM

వీధి వ్యాపారుల నుంచి షాపింగ్స్ మాల్స్ వరకు ప్రతీచోట యూపీఐ సౌకర్యం అనేది ఉంటుంది. దీంతో సెకన్ల వ్యవధిలోనే చెల్లింపులు చేసే సదుపాయం ఉండటంతో ప్రతీఒక్కరూ యూపీఐ పేమెంట్స్‌కు అలవాటు పడిపోయారు. చేతిలో నగదు ఉంచుకోవడం అనేది తగ్గిపోయింది. ప్రతీఒక్కరి చేతుల్లో తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్ ఉండటంతో… డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. దేశంలో డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకి పెరుగుతున్నా.. అనేక రాష్ట్రాల్లోని ప్రజలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో నగదును ఉపయోగిస్తున్నారు. ‘ఇండియాస్ కన్సంప్షన్ స్టోరీ సీవై25’ ప్రకారం.. అనేక రాష్ట్రాల్లో ప్రతి నెలా ఏటీఎంల నుండి కోట్ల రూపాయలు డబ్బులు విత్‌డ్రా చేయబడుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు జరిపినా.. నగదు చెల్లింపులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏటీఎంల నుంచి నగదు ఎక్కువగా విత్‌డ్రా చేసే ఐదు రాష్ట్రాలు ఏవనేది ఒకసారి చూద్దాం.

కర్ణాటక

ఏటీఎంల నుంచి నగదు ఎక్కువగా విత్ డ్రా చేసే రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ప్రతి నెలా ప్రతి ఏటీఎం నుంచి సగటున రూ.1.73 కోట్లు విత్‌డ్రాలు జరుగుతున్నాయి. బెంగళూరు వంటి పెద్ద నగరంలో వ్యాపారాలు, ఉద్యోగులు ఎక్కువమంది ఉన్నారు. రోజువారీ ఖర్చులు కూడా పెద్ద మొత్తంలో ఉంటున్నాయి. దీంతో నగదు అవసరం అనేది ఎక్కువగా ఉంటుందని, ఏటీఎంల విత్ డ్రాలు ఎక్కువగా జరగడానికి అదే కారణమని చెబుతున్నారు.

పశ్చిమ బెంగాల్

పశ్చిమబెంగాల్‌లో ప్రతి నెలా ఒక్కో ఏటీఎం నుంచి సగటున రూ.16.5 మిలియన్లు విత్ డ్రా చేసుకుంటున్నారు. మార్కెట్లు, చిన్న వ్యాపారాలు, చిల్లర కొనుగోళ్లలో క్యాష్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఏటీఎంలలో అధిక సంఖ్యలో నగదు విత్ డ్రాలు జరగడానికి ఇదే కారణమని చెబుతున్నారు.

తమిళనాడు

తమిళనాడులో ప్రతి నెలా ఒక్కో ఏటీఎం నుండి సగటున రూ.16.2 మిలియన్లు నగదు విత్ డ్రాలు ఏటీఎంల నుంచి జరుగుతున్నాయి. తమిళనాడులో పరిశ్రమ, వాణిజ్యం, రోజువారీ కొనుగోళ్లలో నగదు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న దుకాణదారులు, స్థానిక మార్కెట్లలో నగదు చెల్లింపులు ఒక బలమైన ధోరణిగా కొనసాగుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్, ఒడిశా

ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కో ఏటీఎంలో సగటున రూ.15.2 మిలియన్ల విత్ డ్రాలు జరుగుతుండగా.. ఒడిశాలో రూ.15.1 మిలియన్లు జరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా నగదు పైనే ఆధారపడుతున్నారు. చిన్న వ్యాపారాలు, స్థానిక లావాదేవీలలో నగదు ఒక కీలక అంశంగా మిగిలిపోయింది. ఈ కారణంగానే ఏటీఎం విత్‌డ్రాయల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.

Follow Us