
నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ క్రెడిట్ కార్డ్ వినియోగదారులను మోసం చేసే కేసులు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతాము అనే ఆకర్షణీయమైన ఆఫర్తో మోసగాళ్లు కాల్ చేసి సులభంగా ఓటీపీ అడిగి డబ్బులు దోచుకుంటున్నారు. మీరు అలాంటి ఆఫర్ను వద్దునుకుంటే మీరు పెద్ద మోసం నుండి బయటపడ్డారని అర్థం చేసుకోవాలి.
మోసగాళ్లు క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతామని ఆఫర్ చేస్తూ కస్టమర్కు కాల్ చేస్తారు. కస్టమర్ ఆసక్తి చూపగానే, మోసగాళ్లు ఆ వెంటనే వివరాలను అడగటం ప్రారంభిస్తారు. ముందుగా క్రెడిట్ కార్డ్ నంబర్ను అడుగుతారు. తర్వాత కార్డ్ వెనుక ఉండే CVV, గడువు తేదీ అడుగుతారు. చివరికి పరిమితిని పెంచడానికి అవసరమని చెప్పి మొబైల్కు వచ్చిన OTP చెప్పమని అడుగుతారు. కస్టమర్ ఆ సమాచారాన్ని అందించగానే డబ్బులు ఖాతా నుండి మాయమవుతాయి. అప్పటికి గానీ వచ్చింది బ్యాంక్ కాల్ కాదని, మోసగాడి కాల్ అని కస్టమర్ తెలుసుకోలేడు.
ఎవరైనా బ్యాంకు ఉద్యోగి అని చెప్పుకుంటే వారి మాటలను గుడ్డిగా నమ్మవద్దు. కాల్ వస్తున్న నంబర్ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. ట్రాయ్ నిబంధనల ప్రకారం.. త్వరలో అన్ని బ్యాంక్ నంబర్లు 1600 సిరీస్తో ప్రారంభమవుతాయి. ఇది మోసపూరిత కాల్లను గుర్తించడంలో సహాయపడుతుంది.
స్కామర్లు తరచుగా “నేను ప్రధాన కార్యాలయం నుండి కాల్ చేస్తున్నాను, నేను బ్యాంక్ మేనేజర్ని వంటి అతిశయోక్తి వాదనలు చేస్తారు. వాస్తవానికి బ్యాంక్ మేనేజర్లు పరిమితిని పెంచడానికి ఎప్పుడూ నేరుగా కాల్ చేయరు. ఇలాంటి ఆర్భాటపు వాదనలు వింటే వెంటనే అప్రమత్తమవండి.
కాల్ చేసిన వ్యక్తి ఎంత నిజమైన వ్యక్తిగా మాట్లాడినా మీ సీవీవీ, ఓటీపీ లేదా ఇతర కార్డ్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి. గుర్తుంచుకోండి, బ్యాంకులు తమ వినియోగదారుల నుండి ఎప్పుడూ OTP లను అడగవు.
బ్యాంక్ నుండి వచ్చినట్లు కనిపించే OTP సందేశాలు బ్యాంక్ అని స్పష్టంగా పేర్కొంటాయి. స్కామర్లు తరచుగా సాధారణ నంబర్ల నుండి ఒకేలాంటి సందేశాలను పంపుతారు. అలాంటి సందేశాలను నమ్మవద్దు.
మీ కార్డు నుండి డబ్బు తీసినట్లు సందేశం వచ్చి మీరు ఆ లావాదేవీని గుర్తించలేకపోతే, తక్షణమే మీ బ్యాంకుకు కాల్ చేసి కార్డును బ్లాక్ చేయండి. తద్వారా తదుపరి నష్టం జరగకుండా ఆపవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి