రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏం చేయాలి..? చట్టం చెప్పేది తెలుసుకోండి..

రైతుకు భూమి అంటే కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు.. వారి జీవనాధారం. అలాంటి పచ్చని పొలాల్లో ముందస్తు సమాచారం లేకుండా కరెంట్ టవర్లో, టెలికాం టవర్లో వెలిస్తే ఆ బాధ వర్ణాతీతం. నా అనుమతి లేకుండా నా పొలంలో స్తంభాలు నాటడానికి వీళ్లకు హక్కు ఎక్కడిది? అని ప్రతి రైతు మనసులో తలెత్తే ప్రశ్న ఇది. దీన్నిపై చట్టం ఏం చెబుతుందో తెలుసుకోండి..

రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏం చేయాలి..? చట్టం చెప్పేది తెలుసుకోండి..
Farmers Rights In India

Updated on: Jun 22, 2026 | 2:58 PM

మన దేశంలో విద్యుత్, రోడ్లు, నీళ్ల ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు ప్రభుత్వానికి చట్టపరంగా కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, 1885 చట్టం ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికి లేదా లైసెన్స్ పొందిన కంపెనీలకు ప్రైవేట్ భూముల్లో స్తంభాలు నాటడానికి, వైర్లు వేయడానికి కొంతవరకు మినహాయింపులు ఉన్నాయి. ది ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌మిషన్ టవర్ల ఏర్పాటు కోసం భూమిని ఉపయోగించుకునే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. అయితే చట్టం ప్రభుత్వానికి, కంపెనీలకు అధికారం ఇచ్చింది కదా అని, రైతుల హక్కులను పూర్తిగా విస్మరించడానికి వీల్లేదు. ఇక్కడ కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలు ఉన్నాయి.

అధికారులు లేదా కంపెనీలు పాటించాల్సిన నియమాలు

సాధారణంగా ఏ శాఖ అయినా లేదా కంపెనీ అయినా ఒక రైతు భూమి గుండా లైన్లు వేయాలనుకున్నప్పుడు సదరు భూ యజమానికి ముందస్తు సమాచారం ఇవ్వడం చట్టప్రకారం అవసరం. సదరు ప్రాజెక్టు వల్ల రైతు భూమికి లేదా పంటకు వీలైనంత తక్కువ నష్టం జరిగేలా పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది.

నష్టపరిహారం.. రైతు హక్కు..

ఒకవేళ మీ అనుమతి లేకుండా లేదా ముందస్తు నోటీసుతో మీ పొలంలో స్తంభాలు వేసినా, చట్టప్రకారం మీరు నష్టపరిహారం పొందే పూర్తి హక్కు కలిగి ఉన్నారు. టవర్లు వేసే సమయంలో లేదా వైర్లు లాగేటప్పుడు అక్కడ ఉన్న పంటలు, విలువైన చెట్లు దెబ్బతింటే వాటికి తగిన పరిహారం చెల్లించాలి. పొలం మధ్యలో పెద్ద పెద్ద ట్రాన్స్‌మిషన్ టవర్లు వేయడం వల్ల ఆ భూమి మార్కెట్ విలువ పడిపోతుంది. అలాగే అక్కడ భవిష్యత్తులో నిర్మాణాలు చేపట్టడం కుదరదు. దీనిని పరిగణనలోకి తీసుకుని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం భూమి విలువలో నిర్ణీత శాతాన్ని రైతుకు పరిహారంగా ఇవ్వాలి.

అక్రమంగా స్తంభాలు పాతితే ఏం చేయాలి?

  • మీ పొలంలో సరైన ప్రక్రియ పాటించకుండా, అక్రమంగా లేదా బలవంతంగా టవర్లు వేశారని అనుకుంటే మీరు న్యాయం పోరాటం చేయవచ్చు.
  •  ముందుగా స్థానిక విద్యుత్ శాఖ లేదా టెలికాం అధికారులకు రాతపూర్వకంగా మీ అభ్యంతరాన్ని తెలియజేయాలి.
  •  ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 16 ప్రకారం.. భూ యజమాని అభ్యంతరం చెబితే, సదరు కంపెనీ జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు జిల్లా కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. కలెక్టర్ గారు ఇరు పక్షాల వాదనలు విని, నష్టపరిహారాన్ని, రూట్‌ను ఖరారు చేస్తారు.

అధికారులు స్పందించని పక్షంలో మీ ప్రాథమిక హక్కుల రక్షణ కోసం, సరైన నష్టపరిహారం కోసం సివిల్ కోర్టును లేదా హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ లేదా న్యాయపరమైన సహాయం పొందవచ్చు. కాగా చట్టం కేవలం అభివృద్ధిని మాత్రమే చూడదు.. ఆ అభివృద్ధికి మూలమైన రైతు సంక్షేమాన్ని కూడా రక్షిస్తుంది. మీ హక్కులను తెలుసుకోవడం, వాటి కోసం గళం విప్పడం మీ బాధ్యత అనేది మర్చిపోకండి.

రైతులకు వచ్చే సందేహాలు..

ప్రశ్న: నా అనుమతి లేకుండా విద్యుత్ శాఖ లేదా టెలికాం కంపెనీ నా పొలంలో టవర్లు వేయొచ్చా?

జవాబు: వేయోచ్చు. కానీ రైతుకు ముందే సమాచారం ఇవ్వాలి.

ప్రశ్న: నా పొలంలో కరెంట్ లేదా మొబైల్ టవర్ వేస్తే ఎంత నష్టపరిహారం లభిస్తుంది?

జవాబు: పంటకు నష్టం వాటిల్లితే మార్కెట్ ధర ప్రకారం పూర్తి పరిహారం చెల్లించాలి. ఒకవేళ హైటెన్షన్ టవర్లు వేస్తే ఆ భూమి విలువలో 85శాతం వరకు, వైర్లు వెళ్లే కారిడార్ పరిధిలోని భూమి విలువలో కనీసం 15శాతం వరకు పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రశ్న: కంపెనీలు ఇచ్చే నష్టపరిహారం తక్కువగా ఉంటే ఏం చేయాలి?

జవాబు: ఆ పరిహారాన్ని తీసుకోకుండా నిరసన తెలపవచ్చు. వెంటనే కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.

Follow Us