
ప్రభుత్వ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. వీరి జీతాలు భారీగా పెరగనున్నాయి. 13వ ద్విపక్ష ఒప్పందం కోసం చర్చలను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు తమ జీతాల కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా రాబోయే 12 నెలల్లో వేతన సవరణ ప్రక్రియ ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం వేతన సవరణ ప్రక్రియను ఖరారు చేయాలని సూచించింది. 2017 నవంబర్ 1 నుంచి వేతన సవరణ ప్రక్రియ అమలు చేయాలని ఆర్దిక సేవల విభాగం బ్యాంక్ అధిపతులకు లేఖ రాసింది. ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లతో పాటు గరిష్టంగా 12 నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
గతంలో వేతన సవరణ ప్రక్రియ అనేది సంవత్సరాలు తరబడి సాగుతూ ఉండేది. అధికారిక నియమనిబంధనలను సవరించడానికి చాలా సమయం పట్టేది. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి ఉండేది. కానీ ఈ సారి ఆర్ధిక శాఖ వ్యూహం మార్చింది. ఒప్పందంతో పాటు సంబంధిత నియమాలన్నీ ఒకేసారి సవరించే ప్రక్రియను చేపట్టనుంది. సకాలంలో ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా ఉద్యోగులు తదుపరి గడువు తేదీ నుంచే సవరించిన వేతనాల ప్రయోజనం పొందగలరని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డ్ స్థాయి పనితీరును సాధించాయి. 2023 ఆర్ధిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు సాధించగా.. 2024లో రూ.1.41 లక్షల కోట్లు సాధించాయి. ఇక 2025లో రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుంటాయని బ్యాంకులు అంచనా వేశాయి.
ప్రభుత్వ బ్యాంకులు లాభాల్లో ఉండటంతో ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వాలని, దీని వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. భారత ఆర్దిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగం అనేది వెన్నెముక అని, ఉద్యోగులకు మెరుగైన జీతభత్యాలు అందించడం వల్ల వారి నైతిక స్థైర్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దేశ ఆర్దిక వృద్దిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వసిస్తోంది.