
బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచేందుకు సిద్దమవుతున్నాయి. ప్రజలు అధిక ఆదాయం కోసం స్టాక్ మార్కెట్, ఇతర పెట్టుబడి మార్గాలవైపు మళ్లుతుండటంతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచుతున్నాయి. ఇతర పెట్టుబడి మార్గాలతో పోలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో వీటిల్లో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపడం లేదు. డిపాజిట్లను పెంచే చర్యలపై చర్చించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల బ్యాంకులతో ఒక సమావేశం నిర్వహించింది. ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రోత్సహించాలని ఆర్బీఐ సూచించింది. దీంతో బ్యాంకులు ఇప్పుడు వినియోగదారులను ఆకర్షించడంపై దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగా వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్దమవుతున్నాయి.
ఎక్కువమంది తమ బ్యాంకుకు తిరిగి వచ్చేలా ప్రోత్సహించేందుకు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచేస్తున్నాయి. దీని వల్ల ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారు ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచగా.. త్వరలో మిగతా బ్యాంకులు కూడా రేట్లను పెంచేందుకు సిద్దమవుతున్నాయి. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లు మరోసారి ఆకర్షణీయమైన పెట్టుబడిగా మారవచ్చు. కాగా ప్రస్తుతం బంధన్ బ్యాంక్ 7.25 శాతం, డీసీబీ బ్యాంక్ 7.15 శాతం, ఆర్బీఎల్ బ్యాంక్ 7.20 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.50 శాతం, యస్ బ్యాంక్ 7 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 7 శాతం, ఫెడరల్ బ్యాంక్ 6.75 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.60 శాతం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.