
ఆరోగ్య సంరక్షణకు కొత్త నిర్వచనం ఇస్తూ అపోలో హాస్పిటల్స్ కీలక ప్రకటన చేసింది. ఇకపై వీకెండ్లు, సెలవులు సహా ఏడాది పొడవునా 24×7 సేవలు అందించనున్నట్లు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి వెల్లడించారు. అలాగే హైదరాబాద్లో త్వరలోనే ‘హాస్పిటల్ ఆఫ్ ద ఫ్యూచర్’ను ఏర్పాటు చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగితా రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో రెండు రోజులపాటు జరిగిన ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్ –2026 కార్యక్రమం శుక్రవారం ముగిసింది. Global Voices.. One Vision అనే థీమ్తో నిర్వహించిన ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి 27 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. 75కు పైగా సంస్థల నుంచి 300కు మించిన పేపర్ సబ్మిషన్స్, 120కిపైగా అవార్డు ఎంట్రీలు వచ్చాయి.
భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థ దిశగా..
సదస్సు ప్రారంభంలో మాట్లాడిన డాక్టర్ సంగితా రెడ్డి.. అపోలో చేపట్టబోయే టెక్నాలజీ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ మార్పులను వివరించారు. “ఆరోగ్య సంరక్షణ ఆసుపత్రులకే పరిమితం కాకుండా ఒక సమగ్ర వ్యవస్థగా మారుతోంది. ఎపిసోడిక్ కేర్ నుంచి నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ వైపు ప్రయాణిస్తోంది. టెక్నాలజీ ఇక అదనం కాదు.. అదే ఆరోగ్య రంగానికి ఆపరేటింగ్ లేయర్” అని ఆమె అన్నారు. హైదరాబాద్లో రాబోయే హాస్పిటల్ ఆఫ్ ద ఫ్యూచర్ బాధ్యతాయుత AI, భద్రతా ప్రమాణాలు, కొలిచే ఫలితాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అపోలో చేపట్టిన కీలక కార్యక్రమాలుగా డయల్50, క్లినిషియన్ కోపైలట్, పేషెంట్ కోపైలట్, నివారణాత్మక ఆరోగ్యానికి AI రిస్క్ స్కోరింగ్ ప్లాట్ఫామ్, Apollo 24/7 వంటి సేవలను డాక్టర్ సంగితా రెడ్డి వివరించారు. “AI మానవ నిర్ణయాన్ని భర్తీ చేయకూడదు. డాక్టర్లపై ఉన్న అనవసర భారం తగ్గించాలి. రియల్టైమ్లో జోక్యం చేసుకున్నప్పుడే రోగి భద్రత మెరుగవుతుంది,” అని పేర్కొన్నారు.
ఆరోగ్య సంరక్షణకు సెలవులుండవు
ఈ కార్యక్రమంలో వర్చువల్గా మాట్లాడిన డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి.. “మనుషులు ఎప్పుడైనా అనారోగ్యానికి గురవుతారు. ఆరోగ్య సంరక్షణకు నిద్ర ఉండకూడదు. ఇకపై అపోలో హాస్పిటల్స్ ప్రతి రోజు సేవలు అందిస్తాయి. టెక్నాలజీ కరుణకు సేవ చేయాలి.. దానిని భర్తీ చేయకూడదు” అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ప్రాధాన్యం AIకే
చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. “ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో AI ప్రభుత్వానికి వ్యూహాత్మక ప్రాధాన్యం. డేటా నాణ్యతే AI విజయాన్ని నిర్ణయిస్తుంది. భారత్కు ఉన్న డిజిటల్ మౌలిక సదుపాయాలు పెద్ద బలం,” అన్నారు.
నాణ్యతకు ప్రోత్సాహం అవసరం
అపోలో హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ మధు శశిధర్ మాట్లాడుతూ.. “రోగి భద్రత గవర్నెన్స్, AI, నియంత్రణ సంస్థల సమన్వయంపై ఆధారపడి ఉంది. AI పైలట్ ప్రాజెక్ట్లకే పరిమితం కాకుండా పెద్ద స్థాయిలో ఫలితాలు ఇవ్వాలి,” అని అన్నారు.
నమ్మకమే ఆరోగ్యానికి పునాది
జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ సీఈఓ జొనాథన్ పెర్లిన్ మాట్లాడుతూ.. “సురక్షితమైన, సమర్థవంతమైన, మానవీయ వైద్యం ద్వారానే నమ్మకం ఏర్పడుతుంది. బాధ్యతాయుత AI ఆరోగ్య వ్యవస్థలో భాగం కావాలి” అని స్పష్టం చేశారు.
స్టార్టప్లకు వేదిక
IHD–2026 సందర్భంగా THNX స్టార్టప్ డోమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టార్టప్ రెసో భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపికైన స్టార్టప్లు డాక్టర్లు, ఇన్వెస్టర్లతో నేరుగా చర్చించే అవకాశం పొందాయి.