సామాన్యులకు షాక్.. మళ్లీ పెట్రోల్, డీజిల్ భారం?.. ఈ సారి లీటరుకు…

సామాన్యుడికి మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఎగబాకే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే 2 నుంచి 3 వారాల్లో లీటరుకు రూ.10 వరకు ధరలు పెరగొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

సామాన్యులకు షాక్.. మళ్లీ పెట్రోల్, డీజిల్ భారం?.. ఈ సారి లీటరుకు...
Fuel

Updated on: May 16, 2026 | 1:51 PM

దేశ ప్రజలపై మరోసారి పెట్రో వడ్డనకు రంగం సిద్దమయ్యింది. రాబోయే 2-3 వారాల్లో పెట్రో ధరలు లీటర్‌కు రూ.10 పెరిగే అవకాశమున్నట్టు ఆర్ధిక రంగ నిపుణులు వెల్లడించారు. ఇప్పటికే లీటర్‌పై మూడు రూపాయలు పెంచినప్పటికి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇంకా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా పెరగడంతో మరోసారి ధరలు పెంచకతప్పని పరిస్థితి ఉందని అంటున్నారు.

ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కూడా తమ లాభాలను వదులుకుని అధిక వ్యయాన్ని సొంతంగా భరించాయి. ఇంధన ధరలను రూ.3కి పెంచక తప్పలేదు. అయినప్పటికీ ఈ స్వల్ప పెరుగుదల కంపెనీల రోజువారీ నష్టాలను కొంతమేర తగ్గించిందే తప్ప, పూర్తిగా తొలగించలేకపోయింది.

విశ్లేషకుల అంచనా ప్రకారం.. ధరలను ఒక్కసారిగా భారీగా పెంచాల్సిన పరిస్థితి ఉన్నా, దశలవారీగా చిన్న చిన్న పెంపులతో అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఏ రూపంలో పెరిగినా చివరకు భారమంతా సామాన్యుడిపైనే పడనుంది.

ఆర్థిక నిపుణులు చెబుతున్నదేమిటంటే.. ఇంధన ధరలు పెరిగితే దాని ప్రభావం కేవలం వాహనదారులపైనే కాదు. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, పాలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. LPG ధరలు కూడా పెరిగితే గృహిణుల బడ్జెట్‌పై మరింత ఒత్తిడి పడొచ్చని హెచ్చరిస్తున్నారు. వసాయ రంగంపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. డీజిల్ ధరలు పెరిగితే ట్రాక్టర్లు, నీటి మోటార్లు, రవాణా ఖర్చులు పెరిగి రైతుల వ్యయభారం అధికమవుతుంది. చివరకు ఆ ప్రభావం మార్కెట్‌లో సరుకుల ధరల రూపంలో వినియోగదారుడికే తాకుతుంది.

ఆర్థికవేత్తల అంచనా ప్రకారం.. పెట్రోల్, డీజిల్, పాలు, LPG ధరల పెరుగుదల కలిపి దేశ ద్రవ్యోల్బణాన్ని సుమారు 0.42 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది మరో ఆర్థిక దెబ్బగా మారొచ్చని భావిస్తున్నారు.

Follow Us