
జూన్ 3 నుంచి 5 తేదీ వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. కీలకమైన ఈ సమావేశంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది హాట్టాపిక్గా మారింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రతికూల వాతావరణ అంచనాలు, పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల క్రమంలో ద్రవ్యోల్బణంపై ప్రభావం, రూపాయి విలువ పడిపోతునన క్రమంలో ఆర్బీఐ రెపో రేట్లను పెంచుతుందనే ప్రచారం సాగుతోంది. కానీ ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో ప్రజలకు ఊరట కల్పిస్తూ వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంచే అవకాశముందని ఆర్దిక విశ్లేషకులు చెబుతున్నారు.
ఏప్రిల్లో జరిగిన సమావేశంలో రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ ఉంచింది. ఇంధన ధరలు పెరుగుతుండటం, అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా రూపాయి బలహీనపడుతున్న క్రమంలో జూన్ సమావేశం జరుగుతోంది. ఎల్నివో ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడటం వల్ల సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచచాలు వేస్తోంది. వర్షాలు తగ్గితే ఆహార ఉత్పత్తి, ఆహార ధరలపై ప్రభావం పడే అవకాశముంటుంది. దీంతో ఈ సమావేశంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఆర్బీఐ 2025 ఫిబ్రవరి నుండి వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించింది. రెపో రేటును మొత్తం 125 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతం వద్ద స్ధిరంగా ఉంచింది. 2025 డిసెంబర్లో చివరిసారిగా రేటును తగ్గించగా.. అప్పటినుంచి యథాతథ స్థితిని కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ సమావేశంలో దీనిని సరఫరా షాక్గా పరిగణించి ‘న్యూట్రల్ పాజ్’ లో వేచి చూసే వైఖరిని కొనసాగించవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. రెపో రేటును పెంచితే ఈఎంఐలు పెరగడంతో పాటు కొత్తగా రుణాలు తీసుకునేవారికి వడ్డీ రేట్లు పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశం కనిపిస్తుండటంతో.. ఇది ఊరటగా చెప్పవచ్చు.