AI: ఆ ఏఐ మోడళ్లతో భారీ ముప్పు? ఐఎంఎఫ్ తీవ్ర హెచ్చరిక

అధునాతన AI మోడల్స్, ముఖ్యంగా ఆంథ్రోపిక్ క్లాడ్ మిథోస్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ సైబర్ ముప్పులను సృష్టిస్తాయని IMF హెచ్చరించింది. బ్యాంకింగ్, ఇంధనం వంటి కీలక రంగాలకు వ్యవస్థాగత ప్రమాదాలు పొంచి ఉన్నాయని, హ్యాకర్లు భద్రతా లోపాలను వేగంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని IMF పేర్కొంది.

AI: ఆ ఏఐ మోడళ్లతో భారీ ముప్పు? ఐఎంఎఫ్ తీవ్ర హెచ్చరిక
Ai Cyber Threats

Updated on: May 11, 2026 | 9:14 AM

అధునాతన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ప్రపంచానికి కొత్త అవకాశాలు తెరుస్తున్నప్పటికీ, అదే సమయంలో భారీ స్థాయి సైబర్ ముప్పులను కూడా సృష్టించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) హెచ్చరించింది. ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఆంథ్రోపిక్‌ అభివృద్ధి చేసిన క్లాడ్ మిథోస్ అనే శక్తివంతమైన AI మోడల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 7, 2026న ఆంత్రోపిక్ ప్రకటించిన ఈ కొత్త AI మోడల్‌ను సాధారణ ప్రజలకు విడుదల చేయడం లేదని సంస్థ స్పష్టం చేసింది. కారణం ఈ మోడల్ అత్యంత ప్రమాదకరమైన సైబర్ సామర్థ్యాలను కలిగి ఉండటమే. సంస్థ ప్రకారం, మిథోస్ దాదాపు ప్రతి సాఫ్ట్‌వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్‌లోని దాచిన భద్రతా లోపాలను గుర్తించే స్థాయికి చేరుకుంది.

ఐఎంఎఫ్ తాజా బ్లాగ్ పోస్ట్‌లో ఇలాంటి AI నమూనాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వ్యవస్థాగత ప్రమాదంగా మారవచ్చని పేర్కొంది. ముఖ్యంగా బ్యాంకింగ్, చెల్లింపుల వ్యవస్థలు, టెలికాం, ఇంధన రంగాలు వంటి పరస్పర అనుసంధానిత వ్యవస్థలు భారీ సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మోడళ్లు యంత్ర వేగంతో పనిచేయడం వల్ల, హ్యాకర్లు భద్రతా లోపాలను మరింత వేగంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది. భద్రతా ప్యాచ్‌లు విడుదలకాకముందే దాడులు జరిగే పరిస్థితి రావచ్చని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల ఒక సంస్థలోని లోపం, అదే టెక్నాలజీ ఉపయోగించే వందల సంస్థలకు వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ AI మోడళ్లను సమీక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. భారత్, యూరోపియన్ యూనియన్, కెనడా వంటి దేశాలు కూడా తమ సైబర్ రక్షణను బలోపేతం చేసేందుకు మిథోస్ ప్రాప్యత కోరుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మోడల్ ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్లో భాగంగా ఎంపిక చేసిన 40 కంపెనీలకే పరిమితమైంది. వాటిలో అమెజాన్‌, గూగుల్‌, యాపిల్‌ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు దేశాల మధ్య సమాచార పంచకం, అంతర్జాతీయ సహకారం, అలాగే AI ఆధారిత రక్షణ వ్యవస్థల అభివృద్ధి అత్యవసరమని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us