
చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్కు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక అలర్ట్ జారీ చేసింది. చిన్నారికి ఏడేళ్లు వచ్చినా బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయకపోయి ఉంటే.. ఆ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తల్లిదండ్రులకు, సంరక్షకులకు సూచించింది. ఈ మేరకు UIDAI కీలక ప్రకటన విడుదల చేసింది. 5 నుండి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్లను వీలైనంత త్వరగా అప్డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) రిమైండర్ లో పేర్కొంది. ఆధార్ నమోదు కేంద్రాలలో 7 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ నవీకరణలు ఉచితం అని పేర్కొంది. అయితే, 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అప్డేషన్ ప్రక్రియ ఆలస్యం అయితే.. ఆధార్ నంబర్ను రద్దు చేయవచ్చు లేదా.. ఆలస్యమైన అప్డేషన్లకు రూ.100 రుసుము వర్తిస్తుంది.
“నవీకరించబడిన బయోమెట్రిక్తో కూడిన ఆధార్ జీవన సౌలభ్యాన్ని సులభతరం చేస్తుంది.. పాఠశాల అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షలకు నమోదు చేసుకోవడం, స్కాలర్షిప్ల ప్రయోజనాలను పొందడం, DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పథకాలు లాంటి మొదలైన సేవలను పొందేందుకు ఆధార్ అప్డేట్ గా ఉండటం ముఖ్యం.. ఏడేళ్లు దాటిన బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయకపోతే.. ఆధారం నంబర్ డీయాక్టివేట్ అవుతుంది..” అని UIDAI నొక్కి చెప్పింది. తల్లిదండ్రులు/సంరక్షకులు తమ పిల్లలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది.
“ఐదేళ్ల లోపు పిల్లల ఆధార్ నమోదు కోసం వేలిముద్రలు.. ఐరిస్ బయోమెట్రిక్స్ సేకరించబడవు.. ఎందుకంటే అవి ఆ వయస్సులో పరిపక్వత చెందవు” అని UIDAI స్పష్టం చేసింది.
ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, UIDAI పిల్లల ఆధార్తో అనుసంధానించబడిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు SMS హెచ్చరికలను పంపడం ప్రారంభించింది.. తల్లిదండ్రులను తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (MBU) పూర్తి చేయాలని కోరింది.
పిల్లలకి 15 ఏళ్లు నిండినప్పుడు మరొక బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి అని UIDAI తల్లిదండ్రులకు గుర్తు చేసింది.. ఎందుకంటే కౌమారదశలో శారీరక లక్షణాలు మారుతాయి.
చివరి నిమిషంలో వచ్చే ఇబ్బందులను నివారించడానికి.. ఆధార్-లింక్డ్ సేవలకు అంతరాయం లేకుండా యాక్సెస్ ఉండేలా చూసుకోవడానికి తల్లిదండ్రులు వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని UIDAI ప్రకటనలో తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..