చంద్రబాబు హయాంలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాన్ని అవినీతి జరిగిందని సూత్రప్రాయంగా ఖరారు చేసింది ఏపీ కేబినెట్. ఏపీ ఫైబర్ నెట్, చంద్రన్నకానుక, రంజాన్ తోఫా పథకాల్లో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రెండో నివేదికకు ఏపీ మంత్రి వర్గం గురువారం ఆమోదం తెలిపింది. అవినీతి జరిగిందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరో తేల్చాలని కేబినెట్ నిర్ణయించింది. తదుపరి దర్యాప్తునకు మంత్రి వర్గం ఓకే చెప్పింది. దాంతో చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా పథకాలతోపాటు ఫైబర్నెట్ వ్యయాలపై సీబీఐ విచారణకు రంగం సిద్దమైంది.
గురువారం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. బిల్డ్ ఏపీలో భాగంగా గుర్తించిన 16 స్థలాల్లో 11 స్థలాల అమ్మకానికి కేబినెట్ ఓకే చెప్పింది. విశాఖపట్నంలో 7, గుంటూరులో 4 స్థలాల విక్రయానికి కేబినెట్ అంగీకరించింది. వీటితో పాటు గుంటూరులో 1, విశాఖలో 3 చోట్ల గుర్తించిన స్థలాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్బీసీసీ ద్వారా అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తలపెట్టింది. డెవలప్ చేసిన తర్వాత వీటిని ఇ–వేలం ద్వారా విక్రయించనున్నారు. గుంటూరులో ఒక స్థలం అభివృద్ధి తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ కేబినెట్ తీర్మానించింది.
ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రైతులకు పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి 10వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు ఉచిత విద్యుత్, పగటిపూట కరెంటు సరఫరా స్థిరీకరణకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనున్నది.
పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు రివర్స్ టెండరింగులో భాగంగా ప్రభుత్వానికి రూ. 405 కోట్ల ఆదా అయ్యిందని, కాంట్రాక్టు అప్పగించేందుకు హైకోర్టు ముందు జాయింట్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ఫైల్ చేయాలని కేబినెట్ భావించింది. పోలవరం హైడ్రో ప్రాజెక్టు ఐబీఎం వాల్యూ రూ.3,216 కోట్లు కాగా.. 12.6 శాతం లెస్ కొటేషన్తో రూ.2811కోట్లకు బిడ్ దక్కించుకున్నది మెగా సంస్థ.
సన్నిధి యాదవుల వారసత్వపు హక్కులను పరిరక్షించేందుకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బోగాపురం ఎయిర్పోర్టు కోసం కేటాయించిన భూముల్లో 500 ఎకరాలను తిరిగి తీసుకునేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ ఏయిర్పోర్టుకు 2700 ఎకరాలను కేటాయించగా.. దానిని 2200 ఎకరాలకు కుదించారు. 2200 ఎకరాలలోనే ఎయిర్పోర్టు నిర్మించేందుకు నిర్మాణ సంస్థ అంగీకరించిన నేపథ్యంలో మిగిలిన 500 ఎకరాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నది. ఎకరాలనికి రూ. 3 కోట్లుగా ధర వేసుకున్నా… ప్రభుత్వానికి రూ. 1500 కోట్ల ఆదాయం రానున్నది.