Lock-down causing food scarcity for children: ప్రపంచంలో కరోనా ప్రభావం పడని అంశం, రంగం అంటూ లేకుండా పోయింది. కరోనా కంట్రోల్ కోసం విధించిన లాక్డౌన్ కారణంగా చివరికి చిన్నారులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అనేక కారణాల వల్ల తల్లి పాలు దొరకని చిన్నారులకు ఇపుడు మార్కెట్లో సైతం ఫుడ్ దొరక్కపోవడంతో ఆకలి బాధ కూడా చెప్పుకోలేని చిన్నారులు అలమటిస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్తో పసిపిల్లలకు ఆహారపు కొరత ఏర్పడింది. శిశువులకు ఆహారపు కొరత ఎదురవుతుందంటూ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేసింది బాలల హక్కుల సంఘం. నవజాత శిశువుల పాల పొడి ఘనాహారం స్టోర్లలో దొరక్క పోవడంతో చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారని బాలల హక్కుల సంఘం.. మానవహక్కుల సంఘానికి నివేదించింది. కొరత నివారణకు రేషన్ షాపుల ద్వారా రాయితీపై శిశు ఘనాహారం సరఫరా చేసేలా తెలుగు ప్రభుత్వాలను ఆదేశించాలని బాలల హక్కుల సంఘం హ్యూమల్ రైట్స్ కమిషన్కు విజ్ఞప్తి చేసింది.
పౌరసరఫరాల శాఖ ద్వారా నవజాత శిశువులకు పాల ఘనాహారం అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించింది బాలల హక్కుల సంఘం. ఈ విషయంలో హెచ్చార్సీ తక్షణం స్పందించి, తగిన విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలనేది బాలల హక్కుల సంఘం ప్రధాన డిమాండ్.