రాజధాని ఆందోళనకు తెలంగాణ స్పూర్తి..ఫస్ట్ స్టెప్పే అదిరింది

|

Dec 18, 2019 | 6:09 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులుండే ఛాన్సుందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కామెంట్లు అమరావతి రైతుల్లో ఆందోళనను పెంచాయి. రాజధానిని మార్చవద్దని, అమరావతిలోనే కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతాంగం ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించాలని అమరావతి రైతులు నిర్ణయించారు. బుధవారం ఉదయం నుంచే రాజధానిని మార్చవద్దంటూ నిరసనలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని రాజధాని రైతులు […]

రాజధాని ఆందోళనకు తెలంగాణ స్పూర్తి..ఫస్ట్ స్టెప్పే అదిరింది
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులుండే ఛాన్సుందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కామెంట్లు అమరావతి రైతుల్లో ఆందోళనను పెంచాయి. రాజధానిని మార్చవద్దని, అమరావతిలోనే కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతాంగం ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించాలని అమరావతి రైతులు నిర్ణయించారు.

బుధవారం ఉదయం నుంచే రాజధానిని మార్చవద్దంటూ నిరసనలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెంలో రైతులు ఆందోళన చేస్తున్నారు.
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేసి, మూడు నగరాల్లో పెడితే… అమరావతిలో భవ్యమైన రాజధాని వస్తుందన్న ఆశతో భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

రాజధానిని ఇక్కడే కొనసాగిస్తామని గతంలో చెప్పిన జగన్ ఇప్పుడు మాట తప్పి, తమను మోసం చేసారని రైతులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఒక్కటే ఉంటే తమకు ఉపయోగం లేదని, మొత్తం రాజధాని అమరావతిలోనే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యమ కార్యాచరణ ఖరారు

నిరంతరాయంగా ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించిన రాజధాని ప్రాంత రైతాంగం గురువారం రాజధాని బంద్‌కు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల రైతులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి దిగ్బంధం చేయాలని పిలుపునిచ్చారు. మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలని, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారం నుంచి రోడ్ల దిగ్బంధం.. వంటా వార్పు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించాలని తలపెట్టారు.