భారత వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో షాక్ ఇవ్వనున్నారు. ఎలాంటి సుంకాలు లేకుండా కొన్ని వస్తువులను భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలుగా మనదేశానికి ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను తొలగించాలని ట్రంప్ భావించారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ సభ్యులకు ట్రంప్ లేఖ రాశారు.
సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ కింద అమెరికా మార్కెట్లలో భారత్కు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నాం. భారత మార్కెట్లలోనూ మన దేశానికి అలాంటి సదుపాయాలు కల్పించాలని అమెరికా కోరినప్పటికీ.. భారత్ దానిపై స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. అందుకే ఆ దేశానికి ప్రాధమిక వాణిజ్య హోదాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నా అంటూ ట్రంప్ యూఎస్ కాంగ్రెస్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
అయితే జీఎస్పీ ప్రోగ్రామ్ కింద అమెరికా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధన్యత వాణిజ్య హోదాను కల్పిస్తోంది. వాటిలో భారత్ ఒకటి. దీని ద్వారా కొన్ని వస్తువులను అమెరికా మార్కెట్లోకి ఎలాంటి సుంకాలు లేకుండా ఎగుమతి చేసేందుకు వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఆ హోదాను తొలగిస్తే.. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అన్ని వస్తువులకు సుంకాలు కటాల్సి వస్తుంది. దీని వలన దేశానికి భారీ నష్టం చేకూరే ప్రమాదం ఉంది. భారత్తో పాటు టర్కీకి ఈ హోదాను ఉపసంహరించుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు.