ఏపి రాజధాని తరలింపు ఖాయం.. కమిటీ నివేదిక ఇదేనా?

|

Nov 20, 2019 | 3:47 PM

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నించి ఏపీ రాజధాని అమరావతిలో కొనసాగుతుందా లేక వేరే చోటికి తరలిస్తారా అన్న చర్చ మొదలైంది. రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండకు తరలిస్తారని కొందరు, కాదు ఏకంగా కర్నూలుకు తరలిస్తారని మరికొందరు ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం నిర్మాణంలో వున్న కోర్ క్యాపిటల్‌ను తరలిస్తారంటూ కొత్త వాదన కూడా ఇంకొందరు తెరమీదికి తెచ్చారు. ఈ వాదనలు, ప్రచారాల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం రాజధాని అంశాన్ని పరిశీలించేందుకు, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఓ కమిటీని […]

ఏపి రాజధాని తరలింపు ఖాయం.. కమిటీ నివేదిక ఇదేనా?
Follow us on

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నించి ఏపీ రాజధాని అమరావతిలో కొనసాగుతుందా లేక వేరే చోటికి తరలిస్తారా అన్న చర్చ మొదలైంది. రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండకు తరలిస్తారని కొందరు, కాదు ఏకంగా కర్నూలుకు తరలిస్తారని మరికొందరు ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం నిర్మాణంలో వున్న కోర్ క్యాపిటల్‌ను తరలిస్తారంటూ కొత్త వాదన కూడా ఇంకొందరు తెరమీదికి తెచ్చారు. ఈ వాదనలు, ప్రచారాల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం రాజధాని అంశాన్ని పరిశీలించేందుకు, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

రాజధానిపై ఏర్పాటైన కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. ప్రస్తుతం ఈ కమిటీ ప్రతినిధులు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే.. ఈలోగానే కమిటీ నివేదిక అంటూ తెరమీదికి కొన్ని అంశాలు వచ్చాయి. వాటి వివరాలు చూస్తే ఆశ్చర్యంతో పాటు షాక్ కూడా తగిలే పరిస్థితి కనిపిస్తోంది.

అమరావతిలో రాజధానిని కొనసాగిస్తూనే.. గణనీయంగా మార్పులు చేర్పులు చేయాలని రాజధానిపై ఏర్పాటైన అధ్యయన కమిటీ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కోర్ క్యాపిటల్ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతం భారీ నిర్మాణాలకు ఏ మాత్రం అనుకూలం కాదని కమిటీ తేల్చినట్లు తెలుస్తోంది. అందుకే రాజధానికి అవసరమైన కట్టడాలను గుంటూరు శివార్లలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మించాలని రాజధాని కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం.

రాయలసీమ వ్యాప్తంగా రాజధాని కోసం ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో ఏపీ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే.. హైకోర్టును పూర్తిగా తరలించాలా లేక హైకోర్టు బెంచ్‌లను కర్నూలులో ఏర్పాటు చేయాలా అన్నది ఇదమిత్తంగా తేల్చనట్లు సమాచారం. కమిటీ పర్యటన తుది దశలో వున్న నేపథ్యంలో త్వరలోనే నివేదిక ముఖ్యమంత్రి జగన్ చెంతకు చేరుతుందని చెబుతున్నారు. నివేదిక అందిన వెంటనే ముందుగా హైకోర్టుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, బహుశా నెల రోజుల వ్యవధిలోనే హైకోర్టు తరలింపు లేదా బెంచ్‌ల ఏర్పాటు కర్నూలులో మొదలు కావచ్చని సీఎంఓ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

రాజధానిని మొత్తంగా తరలించడం వల్ల ఇప్పటి వరకు చేసిన ఖర్చు నిరర్ధకం అవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి కావస్తున్న కట్టడాలను రాష్ట్ర స్థాయి హెచ్ఓడీ కార్యాలయాలకు వినియోగిస్తూ.. కొత్తగా సచివాలయం, అసెంబ్లీ వంటి భారీ నిర్మాణాలను నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో నిర్మించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి అభిమతం త్వరలోనే వెల్లడయ్యే సంకేతాలున్నాయి.