కరోనా పై పోరుకు బాలయ్య భారీ విరాళం..
కరోనాపై చేస్తున్న యుద్ధంలో నందమూరి బాలకృష్ణ కూడా మేము సైతం అంటూ కదిలారు. పేదలకు సాయంగా..

కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. దానిపై పోరాడటానికి, దాని నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలకు నిధులు చాలా అవసరం. అందుకే, ప్రభుత్వాలకు అండగా, రాజకీయ,సినీ ప్రముఖులు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమలోని పేదలను ఆదుకునేందుకు గానూ మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో స్థాపించిన సీసీసీ ఫౌండేషన్కు చాలా మంది సినీ స్టార్స్ తమవంతు సాయం ప్రకటించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ సదరు ట్రస్ట్కు భారీ విరాళం ప్రకటించారు.
కరోనాపై చేస్తున్న యుద్ధంలో నందమూరి బాలకృష్ణ కూడా మేము సైతం అంటూ కదిలారు. పేదలకు సాయంగా కోటీ 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్ కు అందించారు. కరోనా పై పోరాటానికి తన వంతు బాధ్యతగా 1 కోటి 25 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనా ని అరికట్టడంలో మనందరం భాగస్తులం కావాలని పిలుపునిచ్చారు.