Big News Big Debate: చట్టసభలా… రచ్చబండలా?.. బాధ్యత మరిచిన ప్రజాప్రతినిధులు

ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాల్సిన చట్టసభల్లో సభ్యులు ప్రవర్తన శృతి మించుతోంది. రాజ్యాంగం వారికి ప్రత్యేకంగా కొన్ని ప్రివిలేజెస్‌ ఇచ్చింది నిజమే.. కానీ స్థాయికి మించి విశృంఖలంగా..

Big News Big Debate: చట్టసభలా... రచ్చబండలా?.. బాధ్యత మరిచిన ప్రజాప్రతినిధులు
Big News Big Debate

Updated on: Aug 12, 2021 | 8:43 PM

చట్టసభలా… రచ్చబండలా?
బాధ్యత మరిచిన ప్రజాప్రతినిధులు
ప్రివిలేజెస్‌ ఉంటే చట్టానికి అతీతులా?
సుప్రీంతీర్పులో ఏముంది?

ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాల్సిన చట్టసభల్లో సభ్యులు ప్రవర్తన శృతి మించుతోంది. రాజ్యాంగం వారికి ప్రత్యేకంగా కొన్ని ప్రివిలేజెస్‌ ఇచ్చింది నిజమే.. కానీ స్థాయికి మించి విశృంఖలంగా ప్రవర్తించడానికి లైసెన్స్‌ ఎక్కడా ఇవ్వలేదు. ప్రజాప్రతినిధులు అయినా సరే నేరపూరిత చర్యలకు పడే శిక్షలకు అతీతులేమీ కాదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టంగానే చెప్పింది. అయినా సభ్యుల తీరు మారలేదు. ఇంతకాలం రాష్ట్ర అసెంబ్లీల్లోనే ముష్టిఘాతాలు చూశాం. అన్‌ పార్లమెంటరీ పదాలు విన్నాం. ఇప్పుడు అత్యున్నత రాజ్యసభలోనూ గలాటా చూడాల్సిన దుస్థితి వచ్చింది.

ఏం జరిగిందంటే..
పంజాబ్‌కు చెందిన ఎంపీ ప్రతాప్‌ సింగ్‌ బజ్వా బల్లపైకి ఎక్కి మరీ రూల్స్‌ బుక్స్‌ విసిరేశారు. తాజాగా రాజ్యసభ విడుదల చేసిన ఈ సీసీ ఫుటేజ్‌ లో అయితే ఎంపీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. గడిచిన రెండు రోజులుగా బయట తీరుగుతున్న ఈ రెండు సీన్లు చాలు.. చట్టసభలపై సభ్యులకు గౌరవం ఏపాటిదో.. అసెంబ్లీలోనో.. లేక రాష్ట్ర మండలిలో చోటుచేసుకున్న పరిణామాలు కాదు.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత శాసన వ్యవస్థలో ఒక్కటైన రాజ్యసభలో జరిగిన దురదృష్టకర సంఘటనలు. జపాన్‌, కొరియా దేశాల్లో ఎంపీలు కోట్టుకున్నారని ఎగతాళి చేసిన మనం మరి మన ఎంపీలు చేస్తున్న పనికి ఏమనాలి. చర్చలు జరిపి బిల్లులు అమోదించాల్సిన చట్టసభలో సభ్యుల ప్రవర్తన పట్ల ప్రతిఒక్కరూ సిగ్గుతో తలదించుకునేలా ఉందన్న విమర్శలున్నాయి. చివరకు జరిగిన ఘటనలపై నిద్రకూడా పట్టడం లేదంటూ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కన్నీటి పర్యంతమయ్యారు.

ఆరోపణలు.. వాస్తవాలు..
పెట్రోల్‌ ధరలు, పెగాసిస్‌ పై చర్చకు పట్టుబడితే గొంతు నొక్కారని.. రాజ్యసభలోనే తమపై దాడి జరిగిందని విపక్షాలు అంటున్నాయి. బయటనుంచి సభలోకి వచ్చిన కొందరు తమపై దాడి చేశారంటోంది విపక్షం. విపక్షాల ఆరోపణలు చేస్తుండగా.. అధికారపార్టీ సీసీ ఫుటేజ్‌ విడుదల చేసింది. TMC, కాంగ్రెస్‌ ఎంపీలే మహిళా మార్షల్స్‌ పై దాడి చేశారంటోంది బీజేపీ. ఈ గొడవలో మహిళా మార్షల్‌కు గాయాలయ్యాయంటున్న బీజేపీ.. బాధ్యులైన ఎంపీలపై చర్యలకు డిమాండ్‌ చేస్తోంది. కాంగ్రెస్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది. బయట నుంచి వచ్చిన వ్యక్తులు తమ ఎంపీలపై దాడి చేశారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ స్వయంగా ఆరోపించారు. ఇది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఇందులో నిజానిజాలతో సంబంధం లేదు.. అంత పెద్ద ఆరోపణలపై ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. మొత్తం సీసీ ఫుటేజి బయటపెట్టి మరీ ప్రజలకు వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు వారు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి పార్టీలు ముందుకురావాలి.

సుప్రీంకోర్టు తీర్పులో…
అధికరణలు 105,194 ప్రివిలేజెస్‌ మాత్రమే
సభ్యులు విధులు సక్రమంగా నిర్వర్తించడానికి
సభా హక్కుల ఉల్లంఘన పేరిట క్రిమినల్‌ కేసులు తప్పించుకోలేరు
పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చేయడం ప్రివిలేజ్ కాదు
చట్టసభల్లో ఆస్తి నష్టం జరిగితే విచారణ ఎదుర్కోవాల్సిందే

చట్టసభల్లో అనుచిత ప్రవర్తనపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. మైకులు విసరడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించింది. క్షమార్హం కాదన్న సుప్రీం.. సభ్యుల వికృత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. 2015లో కేరళ కేసులో దాఖలైన క్రిమినల్ కేసుపై సభ మర్యాదను తప్పక కాపాడాలని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వేదికల్లో ప్రవర్తన బాధ్యతగా ఉండాలని సూచించింది.

సభా హక్కులు కల్పించిన రాజ్యాంగం
పార్లమెంట్‌ సభ్యులకు ఆర్టికల్‌ 105
అసెంబ్లీలో సభ్యులకు ఆర్టికల్‌ 194
సభ్యులకు ఫ్రీడం ఆఫ్‌ స్పీచ్‌
సభాపరిధిలో అంశాలపై కోర్టులు జోక్యం చేసుకోజాలవు
స్పీకర్‌దే అంతిమ నిర్ణయం

సరిగ్గా తీర్పు వచ్చి వారంపదిరోజులు అయినా గడవ లేదు. మేథావులు, విద్యావంతులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉండే రాజ్యసభలోనే సభ్యుల తీరు మరోసారి చట్టసభల్లో డొల్లతనాన్ని బయటపెట్టింది. సభ్యుల్లో మార్పు ఆశించలేమా? ప్రజాస్వామ్య పద్దతిలో చర్చలు జరిగేదెప్పుడు? ఈ అంశంపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో మేనేజింగ్‌ ఎడిటర్‌ రజనీకాంత్‌ స్పెషల్‌ చర్చ చేపట్టారు.. ఫుల్‌ వీడియో కోసం కింద లింక్‌ క్లిక్‌ చేయండి.

Follow Us