Andhra Pradesh: సై అంటే సై అంటున్న బాబాయ్- అమ్మాయ్.. రచ్చకెక్కిన తుని టీడీపీ ఇంటిపోరు..

|

Feb 05, 2023 | 8:53 AM

గత కొంతకాలంగా తునిలో బాబాయ్- అమ్మాయ్ మధ్య పోటా పోటీగా సాగుతోంది. తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతోంది. నియోజకవర్గ ఇంఛార్జ్ పదవిని బాబాయ్ నుంచి అమ్మాయ్ కైవసం చేసుకోవడంతో.. టీడీపీ ఇంటి పోరు ఒక్కసారిగా బయట పడింది.

Andhra Pradesh: సై అంటే సై అంటున్న బాబాయ్- అమ్మాయ్.. రచ్చకెక్కిన తుని టీడీపీ ఇంటిపోరు..
Tuni Tdp
Follow us on

కాకినాడ జిల్లా తుని టీడీపీ ఇంటి పోరు.. రచ్చకెక్కింది. ఇప్పటి వరకూ టీడీపీ ఇంచార్జిగా యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు ఉండేవారు. తాజాగా ఈ పోస్టుకు యనమల కుమార్తె.. దివ్య పేరును ప్రకటించింది అధిష్టానం. దీంతో కార్యకర్తల్లో తీవ్ర అలజడి చెలరేగింది. ఇంచార్జ్ మార్పు విషయంలో యనమల కృష్ణుడు తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలందరూ కృష్ణుడికే మద్దతు ప్రకటించినట్టు చెప్పారు. మాకు కృష్ణుడే ఇంచార్జీగా ఉండాలని నినదించారు. అయితే, కృష్ణుడు మాత్రం కార్యకర్తల అభిమతమే తన అభిమతంగా చెప్పుకొచ్చారు. ‘‘మీరేం చేయమంటే అది చేస్తా’’.. అంటూ యనమల కృష్ణుడు కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.

ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉంది కావున.. ఇంఛార్జి పోస్టు ఇచ్చినంత మాత్రాన టికెట్ ఇవ్వాలని లేదని తన కార్యకర్తలకు సర్ది చెప్పారు కృష్ణుడు. తన చివరి రక్తపు బొట్టు వరకూ కార్యకర్తల కోసం పని చేస్తానని అన్నారాయన. తునిలో నలభై ఏళ్లుగా తానొక సామాన్య కార్యకర్తగా పార్టీకి చేశానని. సోదరుడు యనమల రామకృష్ణుడి విజయానికి పాటు పడింది తానేననీ. కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవల్సిన బాధ్యత కూడా తనపై ఉందని అన్నారాయన. ఈ నెలలో చంద్రబాబు ఈ ప్రాంతానికి వస్తారనీ.. అప్పుడే మా అన్నదమ్ముల మధ్య జరుగుతోన్న ఈ గొడవేంటో తేల్చుకుంటానని చెప్పారు కృష్ణుడు.

తుని నుంచి యనమల రామకృష్ణుడు ఆరు సార్లు గెలవగా.. రెండు సార్లు పోటీ చేసిన కృష్ణుడు ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో కృష్ణుడుగానీ బరిలోకి దిగితే ఈ సారి కూడా పార్టీ ఓటమి పాలవక తప్పదని అంటున్నారు రామకృష్ణుడి వర్గీయులు. అందుకే ముప్పై శాతం యూత్ కోటా కింద తన కూతురికి టికెట్ దక్కించుకున్నానని.. అంటున్నారు రామకృష్ణుడు. తనకు కాకుంటే తన కొడుకు శివరామకృష్ణకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు కృష్ణుడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..