Andhra Rains: ముంచుకొస్తున్న అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

ఆవర్తనం ప్రభావంతో గురువారం రాత్రికి ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి శుక్రవారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం ఉదయానికి ఇది దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది.

Andhra Rains: ముంచుకొస్తున్న అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Andhra Weather

Updated on: Sep 25, 2025 | 8:05 PM

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం రాత్రికి ఉత్తర, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల ఆనుకుని వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, శనివారం ఉత్తరాంధ్ర, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగిపోర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదాన్నారు.

శుక్రవారం(26-09-2025) : పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తృతంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..