
విజయనగరం జిల్లా బాడంగి మండలం వీరసాగరంలో చోటుచేసుకున్న ఘటన సంచలనంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం కుటుంబ ఆస్తులు, పుస్తెలతాడుకు సంబంధించిన వాటా విషయంలో ఏర్పడిన విభేదాలతో వదిన ఇంట్లో మరదలు చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. వదిన తనకు సరైన వాటా ఇవ్వలేదనే కక్షతో మరదలు వసంత ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో బాధితురాలి ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి నిందితురాలు ఇంట్లోకి ప్రవేశించి ఇనుప బీరువాను పగులగొట్టి బంగారు ఆభరణాలను అపహరించింది.
చోరీకి గురైన బంగారం విలువ సుమారు పది లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా నిందితురాలిని విజయరామపురం జంక్షన్ లో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆమె వద్ద నుంచి సుమారు పది లక్షల విలువైన బంగారు హారం, నెక్లెస్, పుస్తెలతాడు, గొలుసు, చెవి కమ్మలు, శతమానాలు తదితర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీనివాస్ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి, నగలు, విలువైన వస్తువుల విషయంలో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లో విలువైన ఆభరణాలను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులయినా అప్రమత్తంగా ఉండటం అవసరమని పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి