పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలపై విచారణ జరిపిన హైకోర్టు జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చంటూ తీర్పును ఇచ్చింది. అయితే ఇది సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 10 వ తరగతి పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమీక్ష జరుపుతామని మంత్రి పేర్కొన్నారు.
గ్రేటర్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం వలన పరిస్థితులు గందరగోళంగా మారుతాయని ప్రభుత్వం భావించింది. ఇక గ్రేటర్లోనే ఎక్కువ మంది పదో తరగతి విద్యార్థులు ఉండటంతో పరీక్షలను వాయిదా వేసింది. అందులోనూ సప్లమెంటరీ రాసిన విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్లు దొరకడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన సర్కార్.. అందరికి ఒకేసారి పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక పదో తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్ష నిర్వహించనున్నారు.
Read This Story Also: రజనీకి కరోనా అంటూ బాలీవుడ్ నటుడి ట్వీట్.. ఫ్యాన్స్ ఫైర్..!