Pawan Kalyan: సాగరతీరంలో రుషికొండ యుద్ధం తారాస్థాయికి చేరింది. పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండ పరిశీలనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉదయం నుంచి హైడ్రామా మధ్యనే పవన్ యాత్ర సాగింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్న నోటీసులు ఇచ్చిన పోలీసులు చివరకు కొద్దిమందితో వెళ్లడానికి పవన్ను అనుమతించారు. ఇలా ఆంక్షలతో కూడిన అనుమతితో రుషికొండ చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడ పర్యావరణ చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్నారు పవన్ కల్యాణ్. చట్టాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రే వాటిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
విపత్తులు, తుఫానుల నుంచి కాపాడే కొండను తొలిచేయేడం దారుణమన్న పవన్.. ఉత్తరాంధ్రలో ఈ దోపిడి ఆగాలని, ఇక్కడ జరుగుతున్న దోపిడి ప్రతి ఒక్కరికి తెలియాలని పేర్కొన్నారు. చిన్నపాటి ఉల్లంఘన ఉందని వాళ్లు ఒప్పుకున్నారు కానీ ఇక్కడ అంతకుమించి ఉందన్నారు పవన్. తెలంగాణలోనూ ఇలాగే దోపిడీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తెలంగాణ నుంచి తన్ని తరిమేశారన్నారు. సీఎం ఉండటానికి కొండలు తవ్వి ఇంత పెద్ద భవనాలు కట్టాలా అంటూ ముఖ్యమంత్రి జగన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
అయితే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పర్యాటక శాఖ మంత్రి రోజా స్పందించారు. పవన్ పేర్కొన్నట్లుగా రుషికొండలో రహస్యంగా నిర్మాణాలు జరగడం లేదని, ఎవరైనా వెళ్లి చూడొచ్చని అన్నారు. రుషికొండ విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయని.. వాటిపై న్యాయస్థానాలకు నివేదికలు ఇస్తున్నామని అన్నారు.