దివంగత మాజీ మంత్రి, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో విచారణ మొదలు పెట్టిన ఏడుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందం.. శనివారం కడప ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అన్బురాజన్తో భేటీ అయ్యింది. వివేకా హత్యపై వివరాలు అడిగి వారు తెలుసుకున్నారు. ఇక ఈ రోజు కడప ఆర్ అండ్ బి గెస్ట్హౌస్ నుంచి సీబీఐ అధికారులు పులివెందులకు బయలుదేరారు. పులివెందులలోని వైఎస్ వివేకా ఇంటి నుంచి దర్యాప్తును ప్రారంభించనున్నారు.
కాగా గతేడాది మార్చి 15న వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసుపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఓ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మరో సిట్ బృందాన్ని నియమించింది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సైతం ఈ కేసును విచారించింది. ఇలా మూడు సార్లు విచారణ చేపట్టగా.. దాదాపు 1,300 మంది అనుమానితులను విచారించారు. అయినా ఈ కేసులో నిందితులను పట్టుకోలేకపోయారు. ఇదిలా ఉంటే మరోవైపు వివేకా హత్య కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 4 నెలల ముందే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.