
అది ఒక చిన్న కుగ్రామం.. కానీ ప్రతి ఏటా వేల మైళ్ల దూరం నుంచి వచ్చే విదేశీ పక్షులకు అది ఒక సురక్షితమైన ఆశ్రయం. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెం గ్రామం ఇప్పుడు విదేశీ కొంగల కిలకిలరావాలతో సందడిగా మారింది. దాదాపు రెండు మూడు వందల ఏళ్లుగా ఈ గ్రామానికి, విదేశీ పక్షులకు మధ్య విడదీయలేని అనుబంధం కొనసాగుతోంది.
స్థానికుల కథనం ప్రకారం ఈ పక్షులు నైజీరియా, కొరియా వంటి సుదూర దేశాల నుంచి వలస వస్తాయి. ఏటా జనవరి, ఫిబ్రవరి నాటికి ఇక్కడికి చేరుకుంటాయి. దాదాపు ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి, జూన్ నెలలో తమ పిల్లలతో కలిసి తిరిగి ప్రయాణమవుతాయి. వెలమవారిపాలెం గ్రామస్థులు ఈ పక్షులను కేవలం అతిథులుగా మాత్రమే కాదు, తమ గ్రామ దేవతలుగా భావిస్తారు. వేటగాళ్ల నుంచి, దొంగల నుంచి ఈ పక్షులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వర్షాలు లేని సమయంలో సమీపంలోని గుండ్లకమ్మ నది ఎండిపోయినప్పుడు, గ్రామస్థులే సొంతంగా కుంటలు తవ్వించి, బోరు బావుల ద్వారా నీటిని నింపుతున్నారు. అంతేకాదు, పక్షుల కోసం చేపలను కొనుగోలు చేసి మరీ కుంటల్లో వేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నారు.
ఈ పక్షులు ప్రధానంగా గ్రామంలోని చింత, వేప చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి. ఈ దృశ్యాన్ని చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు, పర్యాటకులు తరలివస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ పక్షుల సంరక్షణకు ప్రభుత్వం మరింత సహకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించి, పక్షుల నివాసానికి అనువుగా మరిన్ని చెట్లను పెంచాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్కు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రకృతికి, మనిషికి మధ్య ఉన్న ఈ అద్భుత బంధం వెలమవారిపాలెంలో స్పష్టంగా కనిపిస్తోంది. మూగ జీవాల పట్ల ఆ గ్రామస్థులు చూపిస్తున్న ప్రేమ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
Also Read: అప్పుగా ఇచ్చిన డబ్బు తీసుకున్నవారు ఎగ్గొట్టారా.. ఇలా చేయండి..