AP News: వీళ్లది అట్లాంటి.. ఇట్లాంటి యాపారం కాదు.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్

| Edited By: Ravi Kiran

Aug 08, 2024 | 11:59 AM

''ఇది యాపారం.. నా దందానే ఇంత..'' అని ఓ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఏంటీ.! ఈ మధ్య వ్యాపారస్తులని కూడా అరెస్ట్ చేస్తున్నారా..? అవును.. జల్సాలకు అలవాటుపడి నలుగురికి అన్నం పెట్టే వ్యవసాయాన్ని వదిలి..

AP News: వీళ్లది అట్లాంటి.. ఇట్లాంటి యాపారం కాదు.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్
Representative Image
Follow us on

”ఇది యాపారం.. నా దందానే ఇంత..” అని ఓ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఏంటీ.! ఈ మధ్య వ్యాపారస్తులని కూడా అరెస్ట్ చేస్తున్నారా..? అవును.. జల్సాలకు అలవాటుపడి నలుగురికి అన్నం పెట్టే వ్యవసాయాన్ని వదిలి.. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకున్న అన్నదమ్ముల చాటుమాటు వ్యాపారం గుట్టు రట్టయింది.

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా పామిడి మండలం పాల్యం గ్రామానికి చెందిన శివకుమార్, నందకుమార్ ఇద్దరు అన్నదమ్ములు.. గతంలో వ్యవసాయం చేసేవారు. వ్యవసాయంలో వచ్చే ఆదాయం సరిపోక.. విలాసాలకు, జల్సాల కోసం తప్పుడు మార్గం ఎంచుకున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు. వ్యవసాయం చేస్తే దండగ అని.. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి వ్యాపారం చేయడం ప్రారంభించారు. కొద్దిరోజులు ఆ వ్యాపారం బాగానే సాగింది. అదేవిధంగా ఇద్దరు అన్నదమ్ములపై అక్రమ మద్యం కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రకాల ప్రీమియం బ్రాండ్ల మద్యం లభిస్తుండటంతో పాటు.. కర్ణాటక కంటే మద్యం ధరలు ఏపీలో తక్కువగా ఉండటంతో అన్నదమ్ములకు కర్ణాటక మద్యం వ్యాపారం గిట్టుబాటు కావడం లేదేమో.. వారి దృష్టి గంజాయి వ్యాపారం వైపు మళ్లింది.

దీంతో ఇంకా ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో గంజాయి వ్యాపారం మొదలుపెట్టారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు తమ బంధువులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి విశాఖ నుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి అమ్మడం ప్రారంభించారు. మూడు నెలల నుంచి గుట్టు చప్పుడు కాకుండా.. గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా గంజాయి కొనుగోలు చేసి అనంతపురం, గుంతకల్లు పట్టణాలలో అమ్మి డబ్బు సంపాదించారు. మూడు నెలల్లో ఆరు కేజీల గంజాయి అమ్మారు ఈ అన్నదమ్ములు.

ఈ క్రమంలోనే శివకుమార్‌కు చెందిన కారులో ఐదుగురు కలసి విశాఖపట్నానికి వెళ్లి జూలై 27వ తేదీ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 9 కేజీల గంజాయి కొనుగోలు చేశారు. అలా తీసుకొచ్చిన గంజాయిని పాల్యం గ్రామంలోని వ్యవసాయ పొలంలో దాచిపెట్టారు. అలా దాచిన తొమ్మిది కిలోల గంజాయిని కారులో తీసుకొని రెండు బైక్‌లపై ఎస్కార్ట్‌లా ముందు వెళుతూ పామిడి పట్టణ శివారులో అమ్మడం కోసం వేచి ఉన్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితులు నుంచి తొమ్మిది కేజీల గంజాయి, ఒక కారు, రెండు బైక్‌లను, 5 వేల రూపాయల నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి అక్రమ వైద్యం తీసుకువచ్చి అమ్ముతున్న శివకుమార్, నందకుమార్‌లపై పలు కేసులు ఉండడంతో.. పోలీసులు అన్నదమ్ముల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే అన్నదమ్ములు ఇద్దరు గంజాయి వ్యాపారం ప్రారంభించారన్న పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు.

ఇది చదవండి: గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..