కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం

విష్ణువర్థన్, వర్షిణి తండ్రి దుర్గాప్రసాద్‌ ఆటో డ్రైవర్‌ కాగా తల్లి ఉమాదేవి గృహిణిగా ఉన్నారు. తన పిల్లలను ఎలా అయినా ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో అద్దె నివాసం రేకుల షెడ్డులోనే ఉంటూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపనతో ఆటో డ్రైవర్‌గా కష్టపడుతున్నారు.

కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
Twins

Edited By:

Updated on: Apr 17, 2026 | 1:31 PM

సాధారణంగా ఇద్దరు విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో ఒకే రకంగా మార్కులు రావడం అరుదు… అలాంటిది ఇద్దరు అన్నాచెల్లెళ్లకు అన్ని సబ్జెక్టుల్లో ఒకే రకంగా మార్కులు రావడమే కాదు టోటల్‌ మార్కులు సైతం ఒకే రకంగా రావడం అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు వీరిద్దరూ కవలలు కావడం మరింత సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. తణుకు పట్టణానికి చెందిన ఇద్దరు కవలలు చూపించిన అద్భుత ప్రతిభను చూసిన వారంతా ఔరా అంటున్నారు. తణుకునకు చెందిన పాలాటి నాగ వెంకట దుర్గాప్రసాద్, ఉమాదేవి దంపతుల కవల పిల్లలు విష్ణువర్థన్, వర్షిణి ఇద్దరికీ కూడా ఇంటర్మీడియేట్‌ మొదటి సంవత్సర పరిక్ష ఫలితాల్లో 463 మార్కులు చొప్పున రావడం ఆశ్చర్యం కలిగించగా, అన్ని సబ్జెక్టుల్లోను ఒకే రకంగా మార్కులు రావడం మరింత అద్భుతంగా మారింది.

తణుకులో ఒక ప్రైవేటే జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియేట్‌ ఎంపీసీ విభాగంలో వచ్చిన మార్కులు చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇపుడు ఇదో వింత గా అందరూ చెప్పుకుంటున్నారు, విద్యార్థుల ప్రతిభను కొనియాడుతున్నారు. విష్ణువర్థన్‌ హాల్‌ టికెట్‌ 2610119981, వర్షిణి 2610122213 నంబర్లతో పరీక్షలు రాశారు. కవలైలన వీరి మార్కులు తెలుసుకుంటున్న వారంతా సోషల్‌మీడియాలో వీరికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. విష్ణువర్థన్, వర్షిణి ఇద్దరు కూడా చిన్నతనం నుంచి చదువుపై మక్కువతో ఉండడమే కాకుండా ఒకరికొకరు పోటీపడి చదవడం అలవాటుగా చేసుకున్నారు. ఒక్కరోజు కూడా పాఠశాల, కళాశాలకు సెలవు పెట్టకుండా పూర్తి హాజరుతో విద్యనభ్యసిస్తున్న వీరి విద్యాభ్యాసం ఎల్‌కేజీ నుంచి 5వ తరగతి వరకు తణుకులోని కిడ్స్‌ అవెన్యూ పాఠశాలలో చదవగా, 6 నుంచి 10వ తరగతి వరకు తణుకు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. 10వ తరగతిలో సైతం వర్షిణికి 578 మార్కులు రాగా విష్ణువర్థన్‌ 561 మార్కులు సాధించాడు. అయితే ఇంటర్ లోనే వీరికి ఒకే విధంగా మార్కులు వచ్చాయి.

విష్ణువర్థన్, వర్షిణి తండ్రి దుర్గాప్రసాద్‌ ఆటో డ్రైవర్‌ కాగా తల్లి ఉమాదేవి గృహిణిగా ఉన్నారు. తన పిల్లలను ఎలా అయినా ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో అద్దె నివాసం రేకుల షెడ్డులోనే ఉంటూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపనతో ఆటో డ్రైవర్‌గా కష్టపడుతున్నారు. తనకు మించిన విద్య అయినా వారి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు. కవలలతోపాటు పెద్ద కుమారుడు రాగ వీర వెంకట రవితేజ ప్రస్తుతం తణుకు పాలిటెక్నిక్‌ కళాశాలో ట్రిబుల్‌ ఈ డిప్లొమో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ముగ్గురు పిల్లలను అప్పులు చేసైనా సరే మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, చదువు లేకపోవడంతోనే తాను ఆటో డ్రైవరుగా ఉన్నానని పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో పగలు రాత్రి కష్టపడుతూనే పయనం సాగిస్తున్నాచి చెబుతున్నారు. కవలలు ఇద్దరూ బీటెక్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా తండ్రి దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు.

Follow Us