
తుని, జూన్ 15: కాకినాడ జిల్లా తునిలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం ఉదంతం పది రోజులు గడిచినా ఇంకా చిక్కుముడి వీడలేదు. అత్యాధునిక డ్రోన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో అడవిని అణువణువూ జల్లెడ పడుతున్నా, చిన్నారి జాడ దొరకకపోవడం కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది.
అధికారుల పరస్పర భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారుల మధ్యే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఐ చెన్నకేశవరావు అనుమానం ప్రకారం.. చిన్నారి అదృశ్యం వెనుక కొండచిలువ పాత్ర ఉందేమోనన్న అనుమానాన్ని తుని రూరల్ సీఐ వ్యక్తం చేశారు. దుస్తులు సహా ఎలాంటి ఆనవాళ్లు దొరక్కపోవడం అందుకు నిదర్శనం కావచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు.
అటవీ శాఖ అధికారి పట్టాభి స్పందన మేరకు.. అటవీ శాఖ అధికారి మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ఆ ప్రాంతంలో మనుషులపై క్రూర మృగాల దాడి జరిగిన దాఖలాలు లేవని స్పష్టం చేయడంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది.
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించి దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించిన ఎస్పీ, గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు.
ఇదిలా ఉంటే..చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయిన సమయంలోనే చనిపోయిన పెంపుడు కుక్క మృతిపై కూడా విచారణ వేగవంతమైంది. ప్రాథమిక విచారణలో డీహైడ్రేషన్ కారణమని తేలినప్పటికీ, దీనిపై పూర్తి స్పష్టత కోసం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, నమూనాలను విశాఖ ల్యాబ్కు పంపించారు. రెండు రోజుల్లో వచ్చే పోస్టుమార్టం నివేదిక ఈ మిస్టరీ కేసులో కీలకంగా మారనుంది.
ప్రస్తుతం పోలీసులు కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తును వేగవంతం చేశారు. పది రోజులుగా గాలిస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడంతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు, చిన్నారి జాహ్నవి ఆచూకీ కోసం అత్యాధునిక థర్మల్ డ్రోన్లను వినియోగిస్తున్నారు హనుమాన్ బృందాలు. థర్మల్ కెమెరాలతో అమర్చిన ఈ డ్రోన్లు వేడి ఆధారంగా చిత్రాలను గుర్తించి రికార్డు చేస్తాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పగలు, రాత్రి సమయాల్లో మనుషులు, జంతువుల కదలికలను గుర్తించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. లైవ్ వీడియో ప్రసారం, GPS ట్రాకింగ్ వంటి సాంకేతిక సదుపాయాలు ఈ డ్రోన్ల ప్రత్యేకత.
చిన్నారి జాహ్నవి ఆచూకీ కోసం హనుమాన్ బృందాలు ఈ థర్మల్ డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా చిన్నారి అదృశ్యమైన ప్రాంతంలోని అడవులు, పామాయిల్ తోటలు, పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అయితే విస్తృతంగా గాలింపు చేపడుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించకపోవడం కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..