
TTD December Quota: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. డిసెంబర్ నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శన టికెట్లు, గదుల కోటాను సెప్టెంబర్ 19 నుంచి 24వ తేదీ వరకు దశలవారీగా ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవల టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్లో సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్లో టికెట్లు పొందిన భక్తులు సెప్టెంబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్దేశిత సొమ్మును చెల్లిస్తే టికెట్లు మంజూరు చేస్తారు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్ల కోటాను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటా కూడా విడుదల కానుంది.
సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా అందుబాటులోకి రానుంది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను కూడా ఆన్లైన్లో విడుదల చేయనుంది.
భక్తులు డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదులను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.