Tirumala: శ్రీవారి అన్నప్రసాదంలో సేంద్రియ బియ్యం వాడకాన్ని ఆపారా.. ఇదిగో క్లారిటీ

|

Jul 03, 2024 | 11:30 AM

శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సేవలు కల్పించడంలో భాగంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది టీటీడీ. కాగా శ్రీవారి అన్న ప్రసాదాన్ని సేంద్రీయ బియ్యంతో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ బియ్యం వాడకాన్ని ఆపినట్లు వార్తలు వచ్చాయి..

Tirumala: శ్రీవారి అన్నప్రసాదంలో సేంద్రియ బియ్యం వాడకాన్ని ఆపారా.. ఇదిగో క్లారిటీ
Tirumala Prasadam
Follow us on

తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుంది. ఇది పూర్తిగా అసత్యం టీటీడీ ఈవో కార్యాలయం తెలిపింది. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు మొన్న అర్చక స్వాములతో, ఆలయ అధికారులతో సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారు. అంతే తప్ప వీటిపై ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని వెల్లడించింది. అయితే కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు తయారీలో మార్పులు చేశారంటూ, దిట్టం పెంచినట్టు పుకార్లు సృష్టిస్తున్నారని వెల్లడించింది. ఇది పూర్తిగా అవాస్తవమని… ఇటువంటి అవాస్తవ వార్తలు నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

జూలై 4న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూలై 4వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 10 నుండి 12వ తేదీ వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఉత్స‌వానికి ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6. 30 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. మ‌ధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..