
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఈ నెల 3న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయ ముఖద్వారాలు మూతపడనున్నాయి. ఈ కారణంతో శ్రీవారి దర్శనాలు బంద్ కానున్నాయి. ఈ క్రమంలో భక్తులకు టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది. రెండు రోజుల పాటు శ్రీవారి దర్శనాలకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా దర్శనాలు బంద్ కానుండటంతో 2,3వ తేదీలకు ఎస్ఎస్డీ టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందులో భాగంగా 1,2వ తేదీల్లో తిరుపతిలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీ నిలిపివేయనున్నారు. తిరిగి మూడో తేదీన నాలుగో తేదీకి సంబంధించిన దర్శనాల టికెట్లను జారీ చేస్తారు.
మూడో తేదీన చంద్రగ్రహణం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. దీంతో 2వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులందరూ ఈ విషయాలను గమనించుకుని దర్శనాలకు ప్లాన్ చేసుకోవాలని సూచించింది. మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. దీంతో దర్శనాలు అన్నీ రద్దు చేయనున్నారు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఆలయ శుద్ది, పుణ్యహవచనం లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని తిరిగి ఓపెన్ చేస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఆ రోజు అన్ని రకాల ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఇక తిరుమలలో అన్న ప్రసాదం పంపిణీ కూడా మార్చి 3వ తేదీన నిలిపివేయనున్నారు. అయితే భక్తులకు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. దీంతో భక్తులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచించింది. అటు మార్చిలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 14న గజవాహన సేవ నిర్వహించనున్నారు. మార్చి 19న ఉగాది సంరద్భంగా పుష్ఫ పల్లకీ ఉత్సవం జరపనను్నారు. ఇక ప్రతీ శుక్రవారం ఉంజల్ సేవ, తిరుచ్చి ఉత్సవాలు నిర్వహించనున్నారు.