
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన గరుడ సేవ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఈ సేవ అత్యంత ముఖ్యమైనది కావడంతో దీనిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రద్దీ కారణంగా ఇప్పటికే వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను కొన్ని రోజుల పాటు రద్దు చేశారు. సామాన్య భక్తుల దర్శనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల క్రమంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ రైలు వివరాలు ఇప్పుడు చూద్దాం.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల క్రమంలో తిరుమలకు భక్తులు పొటెత్తుతున్నారు. దీంతో తిరుపతి వెళ్లే రైళ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రద్దీ కారణంగా తిరుపతికి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా మరో ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. విజయవాడ-తిరుపతి(07606/05605) మధ్య స్పెషల్ ట్రైన్ను ఈ నెల 20వ తేదీన ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. తిరుపతి-విజయవాడ(07606) ప్రత్యేక రైలు ఈ నెల 20న ఆదివారం అర్థరాత్రి 1.15 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి.. ఉదయం 8 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఉదయం 9 గంటలకు బయల్దేరి.. సాయంత్రం 4.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఆ రైలు తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైల్లో మొత్తం 22 కోచ్లు అందుబాటులో ఉంటాయి.
16 సెకండ్ క్లాస్ కోచ్లతో పాటు 4 స్లీపర్, 2 ఎస్ఎల్ఆర్ కోచ్లు ఈ స్పెషల్ రైలులో అందుబాటులో ఉంటాయి. గరుడ సేవ చూసేందుకు తిరుమల వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగపడనుంది. శనివారం రోజు గరుడ సేవ వీక్షించిన అనంతరం ఈ రైలులో విజయవాడ వరకు చేరుకోవచ్చు. ఇక ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇది ఉపయోపగడనుంది. ఈ విషయాన్ని గమనించి భక్తులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ కోరింది. కాగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్ఎస్డీ టోకెన్ల జారీని టీటీడీ నిలిపింది. టోకెన్ అవసరం లేకుండానే భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది. దీంతో తిరుపతిలో టోకెన్ తీసుకోకుండానే నేరుగా కొండపైకి వెళ్లి దర్శనం క్యూలైన్లలోని వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అధికారులు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. 20వ తేదీ తర్వాత తిరిగి ఎస్ఎస్డీ టోకెన్ల జారీని ప్రారంభించనున్నారు.