
సంక్రాంతి పండుగ వస్తున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సెలవులు రావడంతో కుటుంబసభ్యులు, స్నేహితులతో టూర్కు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ టూరిజం శాఖ టూరిస్టులకు కొత్త అనుభూతి కల్పించేలా ఓ నిర్ణయం తీసుకుంది. పర్యాటకులకు కారవాన్ను అందుబాటులోకి తీసుకురానుంది. కేవలం రాజకీయ, సినీ, బిజినెస్ సెలబ్రెటీలు మాత్రమే వాడే కారవాన్లను పర్యాటకుల సౌకర్యాల కోసం ప్రవేశపెట్టాలని ఏపీ టూరిజం శాఖ నిర్ణయించింది. ఇందుకోసం సంక్రాంతికి కారవాన్ టూరిజం ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా పర్యాటకులు కారవాన్లో తిరుగుతూ పర్యాటక ప్రదేశాలను వీక్షించవచ్చు.
సంక్రాంతికి ఏపీ టూరిజంలో కారవాన్ వ్యవస్థను రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ(APTDC) ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. తొలుత పైలెట్ ప్రాజెక్ట్ కింద 4 మార్గాల్లో వీటిని నడపనుంది. ఇందుకోసం 4 కారవాన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కారవాన్ టూరిజంలో పాల్గొనేవారు ముందుగా ఏపీటీడీసీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫ్యామిలీ కోసం కారవాన్ కావాలన్నా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నాలుగు వాహనాలు సిద్దం చేస్తుండగా.. ఇవి సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా రానున్న రోజుల్లో మరిన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ కారవాన్లు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. ఇందులో తిరుగుతూ టూరిస్ట్ ప్రదేశాలను ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి భీమవరం, దిండి వరకు కారవాన్ ప్యాకేజీని సంక్రాంతికి అందుబాటులోకి తీసుకురానుంది. 6 రోజుల ఈ ప్యాకేజ్ ధర రూ.3.50 లక్షలుగా ఉంది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీల్లో భోజన ఖర్చులు టూరిస్టులే భరించుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కారవాన్ టూరిజంను ప్రవేశపెట్టారు. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో కారవాన్ల వ్యవస్థ ఉంది. వీటికి పర్యాటకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కారవాన్ల టూరిజం ఆ రాష్ట్రంలో సక్సెస్ అవ్వడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ వాహనాల్లో 10 నుంచి 12 సీట్ల వరకు ఉంటాయి. కారవాన్ల కోసం ఇండియా లక్సీ, ఎల్ఎల్పీ, ఓటీ డ్రీమ్ లైనర్స్ సంస్థలతో ఏపీ పర్యటకాభివృద్ది శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థలు కారవాన్లను అందించనున్నాయి.