
సిఐ చిన మల్లయ్య ఘటన మరువక ముందే మరొక మహిళను తనను సిఐ రాములు నాయక్ మోసం చేశాడంటూ ఎస్పీని ఆశ్రయించడం కలకలం రేపింది. ఒంగోలుకు చెందిన అరుణ కుమారికి 2004లో వివాహం అయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో విబేధాలు వచ్చాయి. దీంతో ఆమె ఒంగోలు పోలీసులను ఆశ్రయించింది. ఆ సమయంలో అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న రాములు నాయక్ ఆమెకు పరిచయం అయ్యాడు. కొద్దీ రోజుల తర్వాత ఆమె ఫోన్ నంబర్ తీసుకొని ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టాడు. భర్తతో విడిపోయిన అరుణ కుమారి ఒంటరిగా జీవిస్తున్న సమయంలో ఆమెకు దగ్గరయ్యాడు. అదే సమయంలో ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తుండటంతో అరుణ కుమారిని శ్రీశైలం తీసుకెళ్లి అప్పటికే వివాహమైన రాములు నాయక్ అరుణ కుమారిని రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి ఆమె ఆలనా పాలనా రాములు నాయక్ చూస్తూ వస్తున్నాడు.
అయితే, రాములు నాయక్ తెనాలి సిఐగా వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. అరుణ కుమారిని పట్టించుకోవడం మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె ఆరా తీయగా మరొక మహిళతో తెనాలిలో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసింది. దీంతో అరుణ కుమారి సిఐ రాములు నాయక్ ను నిలదీసింది. దీంతో ఆయన ఆగ్రహంతో ఊగి పోతూ తన గురించి బయట చెప్పవద్దని బెదిరించాడు. ముప్పై లక్షల రూపాయలు ఇస్తానని వాటితో బంగారం కొనుక్కొని తనను వదిలేయాలన్నాడు. అయితే అందుకు అరుణ్ కుమారి ఒప్పుకోలేదు. తెనాలి డిఎస్పికి అరుణ్ కుమారి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో రాములు నాయక్ ను విఆర్ కు పంపించారు. అప్పటి నుండి అరుణ కుమారిని వేధించడం మొదలు పెట్టాడు. తాను వీఆర్ కు రావడానికి ఆమె కారణం అంటూ వేధించడం మొదలు పెట్టాడు. మనిద్దరం సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని బాధితురాలు వెల్లడించింది..
వేధింపులు పెరగడంతో.. అరుణ కుమారి గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ను ఆశ్రయించింది. రాములు నాయక్ నుండి తనకు, తన బిడ్డలకు ప్రాణ హాని ఉందని తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. అయితే రాములు నాయక్ ను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వరుసగా పోలీసులు ఇలా వివాహేతర సంబందాల్లో చిక్కుకొని సస్పెండ్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..