Andhra Pradesh: ఆ విషయంలో కేసీఆర్ తో పోలుస్తూ జగన్ పై టీడీపీ విమర్శనాస్త్రాలు..

|

Sep 30, 2022 | 1:43 PM

తెలంగాణలో మొదలైన మోటర్లకు మీటర్ల పంచాయతీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేస్తోంది. తాజాగా ఏపీ విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మోటార్లకు స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు..

Andhra Pradesh: ఆ విషయంలో కేసీఆర్ తో పోలుస్తూ జగన్ పై టీడీపీ విమర్శనాస్త్రాలు..
TDP Leader Somireddy Chandramohan Reddy
Follow us on

తెలంగాణలో మొదలైన మోటర్లకు మీటర్ల పంచాయతీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేస్తోంది. తాజాగా ఏపీ విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మోటార్లకు స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు ఎటువంటి నష్టం లేదని, పైగా ప్రభుత్వ ఆదాయం ఆదా అవుతుందని చేసిన వ్యాఖ్యాలపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పోలుస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి తీరుతామని విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారని.. దీని వల్ల ఆదాయం ఆదా అవుతుందని చెప్పారని.. మంత్రికి తాను సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నానంటూ.. మీటరు పెడితే విద్యుత్ తక్కువ ఎలా అవుతుందని ప్రశ్నించారు. 18లక్షల మీటర్లకు 4,500 కోట్లు ఖర్చు అవుతుంది. అందులో కమిషన్ మిగుల్చుకునేందుకే విద్యుత్తు మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లుందని విమర్శించారు. 12 గంటలు కరెంటు ఇస్తామని 5 గంటలకు తగ్గించారన్నారు. విద్యుత్తు మోటర్లకు మీటర్లు నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే వెనక్కు తీసుకుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంతలా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఓ వైపు తెలంగాణ లో మీటర్ల నిర్ణయాన్ని అక్కడి సీఏం కేసీఆర్ వ్యతిరేకిస్తుంటే, ఇక్కడ సీఏం జగన్ రైతులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతులు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయవద్దని, ఏ ఒక్కరూ విద్యుత్తు మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసుకోవద్దంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు సూచించారు. మోటర్లకు మీటర్లు పెట్టుకోకపోతే ఏమవుతుందో తేల్చుకుందాం అంటూ ప్రభుత్వానికి సవాలు విసిరారు.

మరోవైపు సెప్టెంబర్ 29వ తేదీ గురువారం ఏపీ విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
వ్యవసాయ మోటార్లకు మీటర్లపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, త్వరలో మరో 77వేల కనెక్షన్ లను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 2023 మార్చి నాటికి వందశాతం వ్యవసాయ విద్యుత్తు మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఇప్పటికే 70 శాతం మంది రైతులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) కోసం ఖాతాలను తెరిచారని , స్మార్ట్ మీటర్ల వల్ల రైతులు నష్టపోయేది ఏమీ లేదని చెప్పారు. స్మార్ట్ మీటర్ల వల్ల 30 శాతం మేర సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వానికి ఆదా అవుతోందన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్ల ఏర్పాటుకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన శ్రీకాకుళం జిల్లాలో ఈ విషయం నిరూపితం అయ్యిందన్నారు.

ఇవి కూడా చదవండి

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ప్రతిపక్ష టీడీపీ ఎప్పటినుంచో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ విషయంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. విద్యుత్తు మోటార్లకు మీటర్ల నిర్ణయానికి తమ పార్టీ వ్యతిరేకమని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని చేస్తామని టీడీపీ చెబుతుంటే, మరోవైపు వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీ వ్యాప్తంగా విద్యుత్తు మోటార్లకు మీటర్లు ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చెప్పడంతో ఈ విషయంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయికి వెళ్తుందో వేచిచూడాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..