Kinjarapu Atchannaidu: లోకేష్‌ను, నన్ను విడదీయలేరు… వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన అచ్చెన్నాయుడు

తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. నారా లోకేష్ బాబును అచ్చెన్నాయుడు తిడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Kinjarapu Atchannaidu: లోకేష్‌ను, నన్ను విడదీయలేరు... వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన అచ్చెన్నాయుడు
Atchannaidu Reactions On Scolding Video

Updated on: Apr 13, 2021 | 6:14 PM

Kinjarapu Atchannaidu Reactions: తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబును అచ్చెన్నాయుడు తిడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పార్టీలో దుస్థితి ఇలా ఉందంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో టీడీపీ నేతకు మధ్య జరిగిన సంభాషణ వీడియో అది. పార్టీ క్యాడర్‌ను చంద్రబాబు, లోకేష్‌ వాడుకుని వదిలేస్తున్నారని సదరు టీడీపీ నేత.. అచ్చెన్నాయుడు ముందు గోడు వెల్లబోసుకున్నాడు. తండ్రీకొడుకులు ప్రవర్తిస్తున్న తీరుపై మండిపడ్డాడు. తనకు పార్టీలో జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. లోకేష్‌ను‌ ఉద్దేశించి ‘ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ‘పార్టీ లేదు.. ఏమి లేదు’ అంటూ టీడీపీ నేతకు వత్తాసు పలికారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోపై అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. టీడీపీ యువ నాయకుడు లోకేష్‌తో తనకున్న అనుబంధాన్ని విడ‌దీయ‌లేవని ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఐకమత్యంతో పనిచేస్తున్నామని, జగన్‌కు ఓట‌మి భ‌యం పట్టుకుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. వివేకా హత్యపై నారా లోకేష్ విసిరిన స‌వాల్‌కి తోక‌ ముడిచావని జగన్‌ని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

నిన్న చంద్రబాబు స‌భ‌పై రాళ్లేయించారని, ఇవాళ తన సంభాష‌ణ‌ల్ని వ‌క్రీక‌రించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తన సొంత ఛానళ్ల ద్వారా ఎన్ని త‌ప్పుడు‌ వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించ‌లేవని జ‌గ‌న్‌పై అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఎన్ని విష‌ ప‌న్నాగాలు ప‌న్నినా టీడీపీ విజ‌యాన్ని ఆప‌లేవని జగన్‌ను అచ్చెన్న హెచ్చరించారు.

ఇదిలావుంటే సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభలో రాళ్ల దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈనెల 12వ తేదీన తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళతో సహా ఓ యువకుడికి స్వల్ప గాయాలయ్యాయని చంద్రబాబు నాయుడు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

అయితే, ఈ దాడిని చంద్రబాబునాయుడు ఆడిన డ్రామాగా వైసీపీ నేతలు కొట్టిపారేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కాగా, ఘటనకు సంబంధించి టీడీపీ నేతలు అటు ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మరోవైపు, తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ కేంద్ర బలగాల భద్రత నడుమ నిర్వహించాలని తెలుగు దేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read Also… టీవీ9 ఠీవి అవార్డులు :అన్ని ఛానెల్స్ లో కనిపించే తారలు టీవీ9లో ఒకేసారి కనిపించే పండగ :TV9 TheeviAwards Live

Loading...
Unable to load recommendations.
Follow Us