TDP-Janasena: స‌మ‌న్వయమే లక్ష్యం.. టీడీపీ-జ‌న‌సేన నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ఆత్మీయ‌ స‌మావేశాలు ప్రారంభం.. మరో రెండు రోజులు

రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వ‌ర‌కూ రెండు పార్టీల నేత‌లు క‌లిసే ఉండాలి.. చిన్నచిన్న మ‌న‌స్పర్ధలున్నా అన్నింటినీ వీడండి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళ‌న‌ల్లో క‌లిసి పోరాడాలి.. ఇదే ఉద్దేశంతో తెలుగుదేశం-జ‌న‌సేన పార్టీల ఆత్మీయ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ప్రతి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఈ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వయం కోసం రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఐక్య కార్యాచ‌ర‌ణ కమిటీని ప్రకటించాయి.

TDP-Janasena: స‌మ‌న్వయమే లక్ష్యం.. టీడీపీ-జ‌న‌సేన నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ఆత్మీయ‌ స‌మావేశాలు ప్రారంభం.. మరో రెండు రోజులు
TDP, Janasena

Edited By:

Updated on: Nov 14, 2023 | 4:57 PM

రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వ‌ర‌కూ రెండు పార్టీల నేత‌లు క‌లిసే ఉండాలి.. చిన్నచిన్న మ‌న‌స్పర్ధలున్నా అన్నింటినీ వీడండి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళ‌న‌ల్లో క‌లిసి పోరాడాలి.. ఇదే ఉద్దేశంతో తెలుగుదేశం-జ‌న‌సేన పార్టీల ఆత్మీయ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ప్రతి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఈ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వయం కోసం రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఐక్య కార్యాచ‌ర‌ణ కమిటీని ప్రకటించాయి. రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల నేతలు కలయిక, ఉమ్మడి కార్యక్రమాలపై జేఏసీ చర్చిస్తుంది. ఇక జేఏసీ నిర్ణయం మేరకు జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు జరిగాయి. ప్రతి ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య సమన్వయం కోసం ఈ సమావేశాలు జరిగాయి. కొన్ని జిల్లాల్లో రెండు పార్టీలకు కీలక నాయకులు ఉండటం, పొత్తు వల్ల అసంతృప్తి లేకుండా ఉండేలా కలిసి ముందుకెళ్లడం వంటి అంశాలపై జిల్లా స్థాయిలో చర్చించారు. జిల్లా స్థాయిలో, ప్రతి పార్లమెంట్ పరిధిలో నేతల మధ్య విభేదాలు లేకుండా కలిసి ముందుకెళ్లాలని ఈ సమావేశాల్లో నిర్ణయించారు. ప్రభుత్వంపై ఉమ్మడిగా చేపట్టే ఎలాంటి ఆందోళన అయినా రెండు పార్టీల నాయకులు కలిసికట్టుగా చేసి విజయవంతం చేసేలా ముందుకెళ్లాలని జిల్లా సమావేశాల్లో నిర్ణయించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నేతల మధ్య సమన్వయం కుదరడంతో నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ సూచన మేరకు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ప్రారంభమయ్యాయి.

మూడు రోజుల పాటు 175 నియోజకవర్గాల్లో కొనసాగనున్న భేటీలు

రాష్ట్రస్థాయి ఉమ్మడి కార్యాచరణ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రెండు పార్టీల ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 14,15,16వ తేదీల్లో నియోజకవర్గ సమావేశాలు నిర్వహించాలని జేఏసీ సూచించింది. జేఏసీ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ స‌మావేశాలు కొనసాగుతున్నాయి.. మూడు రోజుల్లో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మావేశాలు జ‌రిపేలా పార్లమెంట్ స్థాయిలో షెడ్యూల్ ఖ‌రారు చేసారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతున్న స‌మావేశాల్లో ప్రధానంగా క్షేత్ర స్థాయిలో ఎలా ముందుకెళ్లాల‌నే దానిపైనే చ‌ర్చిస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోకు సంబంధించి కూడా చాలా వ‌ర‌కూ స్పష్టత రావ‌డంతో మేనిఫెస్టోలోని హామీల‌తో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల‌పై ఉద్యమాలు చేయాల‌ని నిర్ణయం తీసుకుంటున్నారు. పొత్తుల ప్రక‌ట‌న త‌ర్వాత కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారాయి. అప్పటికే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సీటు వ‌స్తుంద‌నే ఆశతో ప‌నిచేస్తున్న నేత‌లు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి అసంతృప్తులను క‌లుపుకుని పోవ‌డం.. క‌లిసి ఉద్యమాలు చేయ‌డంపైనే ఆత్మీయ స‌మావేశాల్లో చ‌ర్చిస్తున్నారు. ఇక ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల వారీగా ఉన్న రెండు పార్టీల నేత‌ల‌ను ఆత్మీయ స‌మావేశాల ద్వారా ఒకే వేదిక‌పైకి తీసుకొస్తున్నారు. ముందుగా రెండు పార్టీల నేత‌లు మ‌న‌స్పూర్తిగా క‌ల‌వ‌డం ద్వారా ప్రజా స‌మ‌స్యల‌పై పోరాటాలు చేస్తే ఫ‌లితం ఉంటుంద‌ని ఆశిస్తున్నారు. ఇక గ్రామ స్థాయిలో కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల‌ను తీసుకెళ్లేందుకు ఈ స‌మావేశాల్లో ప‌లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ఆత్మీయ సమావేశాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు రెండు పార్టీలు కూడా క‌మిటీలు నియ‌మించుకున్నాయి. ఈ క‌మిటీలు ఎప్పటిక‌ప్పుడు స‌మ‌న్వయం చేసుకుంటూ ఉమ్మడి కార్యాచ‌ర‌ణ‌ను స‌క్సెస్ చేసేలా ముందుకెళ్తున్నాయి.

మండ‌ల‌, గ్రామ‌స్థాయి వ‌ర‌కూ ఉమ్మడిగా కార్యక్రమాలు చేయ‌డంపై చర్చ..

నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ఆత్మీయ స‌మావేశాల్లో మండ‌లాలు, గ్రామాల్లో ఉమ్మడి కార్యాచ‌ర‌ణ విజ‌య‌వంతం చేయ‌డంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాయి. ఈనెల 18 నుంచి క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరాటాలు చేయాల‌ని రాష్ట్రస్థాయి జేఏసీ నేత‌లు సూచించారు. దీనికనుగుణంగా జిల్లాల వారీగా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఆత్మీయ స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పట‌కే రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వయం ఏర్పడింది. ఎన్నిక‌ల వ‌ర‌కూ ఎలాంటి విభేదాలు లేకుండా రెండు పార్టీల నాయ‌కులు క‌లిసిప‌నిచేయ‌డం, ఓట్ల బ‌ద‌లాయింపుపై దృష్టి పెట్టేలా తెలుగుదేశం, జనసేన నేతలు ముంద‌స్తుగా చ‌ర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us