Chandrababu: రజనీపై ‘వైసీపీ’ విమర్శలు.. చంద్రబాబు ఫైర్‌.. నోటి దురుసు నేతలను జగన్‌ అదుపులో పెట్టుకోవాలంటూ..

వైసీపీ ప్రభుత్వంపై రజనీకాంత్‌ చిన్న విమర్శ కూడా చేయలేదని.. ఎవరినీ చిన్న మాట అనలేదని చంద్రబాబు తాజాగా ట్వీట్‌ చేశారు. రజనీకాంత్‌పై వైసీపీ నాయకులు అసభ్యకర విమర్శలతో దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

Chandrababu: రజనీపై వైసీపీ విమర్శలు.. చంద్రబాబు ఫైర్‌.. నోటి దురుసు నేతలను జగన్‌ అదుపులో పెట్టుకోవాలంటూ..
Tdp Chief Chandrababu

Updated on: May 01, 2023 | 11:13 AM

అదే వేడి.. రోజులు గడిచినా సెగ తగ్గలేదు. పొలిటికల్‌ హీట్‌ మంటపుట్టిస్తూనే ఉంది. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు.. ఆ సభలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చేసిన కామెంట్స్.. ఇంకారాజకీయ రచ్చ లేపుతూనే ఉన్నాయి. చంద్రబాబును విజనరీ లీడర్‌గా రజనీకాంత్‌ ప్రశంసల జల్లు కురిపించడంపై అధికార వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంపై రజనీకాంత్‌ చిన్న విమర్శ కూడా చేయలేదని.. ఎవరినీ చిన్న మాట అనలేదని చంద్రబాబు తాజాగా ట్వీట్‌ చేశారు. రజనీకాంత్‌పై వైసీపీ నాయకులు అసభ్యకర విమర్శలతో దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ‘అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని..అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌ పై వైసీపీ నేతల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు..ఎవరినీ చిన్న మాట కూడా అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి.. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు చంద్రబాబు.

అన్నదాతల గోడు పట్టదా?

అలాగే మరో ట్వీట్ లో  ‘రజనీకాంత్ ను తిట్టే పని కాదు.. ధాన్యం రైతుల కష్టాలు చూడండి. పవన్ కళ్యాణ్ ను ఆడిపోసుకోవడం కాదు.. మిర్చి రైతుల బాధలు వినండి. ప్రతిపక్ష నేతల అరెస్టులు, దాడులు కాదు.. పొలంలో అన్నదాతల దుస్థితిపై దృష్టి పెట్టండి. అకాల వర్షాల కారణంగా రైతాంగం నష్టపోతుంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. మంత్రులు కనీసం ఒక్క చోట కూడా రైతుల దగ్గరకు, పొలాల్లోకి వెళ్లడం లేదు.అన్నదాత కష్టం పై కనీసం ఆరా తీయడం లేదు. ఇక సీఎం సంగతి సరేసరి.  కర్షకులకు భరోసా ఇవ్వండి…ప్రభుత్వం నుంచి తగిన సాయం చేయండి’ అని రాసుకొచ్చారు చంద్రబాబు.

ఇవి కూడా చదవండి

చంద్ర బాబు ట్వీట్

 

అసలే ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఉప్పు నిప్పుగా ఉంది రాజకీయం. రెండు పక్షాలకు అస్సలు పడటం లేదు. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు వచ్చిన రజనీకాంత్‌.. ఆ సభలో చంద్రబాబును ఉద్దేశించి చేసిన కామెంట్స్‌తో అధికారపార్టీకి టార్గెట్‌ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు స్పందించడంతో ఆ రచ్చ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. మరి ఈ రచ్చకు ఎప్పుడు ఫుల్‌ స్టాప్‌ పడుతుందో. మరోవైపు రజనీకాంత్‌ను విమర్శించిన వైసీపీ నేతలపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో ట్విటర్‌లో #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..