
నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఓ వివాహిత అనుమానాస్పద మృతిపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలోని అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన 20 ఏళ్ల శివప్రియ మృతి ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ నందికొట్కూరు పోలీస్ స్టేషన్ను ముట్టడించి ఆందోళన చేపట్టారు.
శివప్రియకు నందికొట్కూరుకు చెందిన సీపీఎం నేత నాగేశ్వరరావు కుమారుడు శివతో సుమారు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. అయితే తాజాగా శివప్రియ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహంపై రక్తపు మరకలు ఉండటంతో కుటుంబ సభ్యుల్లో అనుమానాలు మరింత పెరిగాయి.
శివప్రియ ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
ఆందోళనలో భాగంగా కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమకు న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఆందోళనకారులు ఎస్సై కాళ్లు పట్టుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్న ఘటన కలకలం రేపింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శివప్రియ మృతికి అసలు కారణమేంటి? అది ఆత్మహత్యా, హత్యా? అనే విషయాలను పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..